ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ-లింక్ ద్వారా లాజిస్టిక్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. మొత్తంగా ఐదు రంగాలను ఈ కార్పొరేషన్ అనుసంధానించనుంది.
పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్లు, అంతర్గత జలరవాణా, గిడ్డంగులను అనుసంధానిస్తూ లాజిస్టిక్స్ వ్యయం తగ్గించడంపై ఈ ఏపీ-లింక్ దృష్టి పెట్టబోతోంది. రాష్ట్రంలోని లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు, సమన్వయం, పర్యవేక్షణకు ఏపీ లింక్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది.
ఈ కార్పొరేషనుకు ఒక ఎండీతో పాటు, వివిధ అనుబంధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సేవలిందిస్తారు. అలాగే సలహా కమిటీని, క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను అమలు చేయడానికి జిల్లా స్థాయి సెల్స్ ఏర్పాటు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే హోల్డింగ్ కంపెనీ తరహాలో ఏపీ-లింక్ వ్యవహరించనుంది. ఏపీ లింక్ ద్వారా లాజిస్టిక్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా చూడాలని, అలాగే క్షేత్ర స్థాయిలో వివిధ రంగాలకు అవసరమైన లాజిస్టిక్స్ అందించే విషయంలో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.