AP Agriculture, Rayalaseema Projects: భూమి అనేది రైతు ఆత్మగౌరవమని, గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తమైన రెవెన్యూ వ్యవస్థను మళ్లీ గాడిలో పెడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని కొత్త బురుజు గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, గత పాలకుల ధనదాహానికి భూ రికార్డులు బలి అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కేవలం ప్రైవేట్ భూములపై పెత్తనం చలాయించడానికేనని, అందుకే అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసి రైతులకు భరోసా ఇచ్చామన్నారు. గత ఐదేళ్లలో రెవెన్యూ శాఖలో జరిగిన అక్రమాలను సీఎం తీవ్రంగా ఎండగట్టారు. సాధారణ రైతుల భూములను సైతం మాజీ మంత్రులు తమ అనుచరులకు కట్టబెట్టారని, అడిగిన వారికి భూమి ఇవ్వకపోతే దౌర్జన్యంగా '22A' జాబితాలో పెట్టి వేధించారని గుర్తు చేశారు. సర్వే రాళ్ల దగ్గర నుంచి పట్టాదారు పుస్తకాల వరకు ప్రతి చోటా అప్పటి ముఖ్యమంత్రి ఫోటోలు ముద్రించుకోవడానికే రూ.750 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు.
రైతుల కష్టార్జితంతో కొన్న భూములపై ఫోటోల పిచ్చితో పెత్తనం చేశారని, ఆ తప్పులను సరిదిద్దడానికి ఇప్పుడు తమ ప్రభుత్వానికి ఎంతో సమయం పడుతోందని పేర్కొన్నారు. రైతులకు పూర్తి పారదర్శకతతో కూడిన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. ఇకపై పట్టాదారు పుస్తకాలను ఎవరూ ట్యాంపర్ (మార్చడం) చేయలేరని, ఇందుకోసం అత్యాధునిక 'బ్లాక్ చెయిన్' టెక్నాలజీని వాడుతున్నామని వెల్లడించారు. పుస్తకాలపై క్యూఆర్ కోడ్ ఉంటుందని, రికార్డులు మార్చాలని చూస్తే అధికారులైనా సరే దొరికిపోతారని హెచ్చరించారు. పైసా ఖర్చు లేకుండా, అవినీతికి తావులేకుండా ఉచితంగా ఈ కొత్త పాసుపుస్తకాలను ప్రతీ రైతు ఇంటికి చేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కేవలం భూములే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సీఎం ప్రస్తావించారు. కల్తీ మద్యంతో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, ఎక్సైజ్ శాఖలో వందల కోట్ల అవినీతి జరిగిందని మండిపడ్డారు. పవిత్రమైన తిరుమల లడ్డూ నెయ్యిని కూడా కల్తీ చేసిన ఘనత గత పాలకులదేనని దుయ్యబట్టారు. ఒకప్పుడు బాంబుల మోతతో విన్పించిన రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలికి, గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చామని, వైరం ఉన్న నేతలను సైతం కలిపి అభివృద్ధి వైపు నడిపిస్తున్నామని చంద్రబాబు వివరించారు.
రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా మార్చడమే తన సంకల్పమని చంద్రబాబు ప్రకటించారు. స్వర్గీయ ఎన్టీఆర్ శ్రీకారం చుట్టిన హంద్రీనీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులను పూర్తి చేసే అదృష్టం తనకు దక్కిందని, భగీరథుని స్ఫూర్తితో సీమలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. డోన్ ప్రాంతంలోని 30 చెరువులకు హంద్రీనీవా ద్వారా నీరు అందించామని, రాబోయే రోజుల్లో ఇక్కడి పంటలు దేశవ్యాప్తంగా ఎగుమతి అయ్యేలా ఆధునిక వ్యవసాయ పద్ధతులను తీసుకొస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు.