Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతన్నలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన 'అన్నదాత సుఖీభవ' పథకం నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. గన్నవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేశారు. ఉగాది పండుగ కానుకగా ఈ నిధులను విడుదల చేయడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ నిధులతో కలిపి ఈ విడతలో ఒక్కో రైతుకు 6,000 రూపాయల చొప్పున జమ అయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6.85 లక్షల మంది రైతులకు ఈ లబ్ధి చేకూరనుంది. ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే గత రెండు విడతల్లో 14,000 రూపాయలను ప్రభుత్వం అందజేసింది. తాజాగా విడుదల చేసిన మూడో విడత నిధులతో కలిపి, ఈ ఏడాదికి నిర్దేశించిన మొత్తం 20,000 రూపాయల లక్ష్యాన్ని ప్రభుత్వం పూర్తి చేసినట్లయింది. అర్హులైన ప్రతి రైతుకూ ఈ సాయం అందాలని, ఎవరూ మిగిలిపోకూడదని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
డబ్బులు అకౌంట్లో పడ్డాయా లేదా అని తెలుసుకోవడానికి రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం దీని కోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది. రైతులు తమ స్మార్ట్ఫోన్ ద్వారానే నిమిషాల వ్యవధిలో పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం annadathasukhibhava.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి, అక్కడ ఉన్న 'Know Your Status' ఆప్షన్ను ఎంచుకోవాలి. మీ ఆధార్ నంబర్ స్క్రీన్ మీద కనిపించే క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే, మీ అకౌంట్లో నగదు జమ అయిందో లేదో క్లియర్ గా కనిపిస్తుంది.
ఒకవేళ వివరాలు ఎంటర్ చేసినా స్టేటస్ సరిగ్గా చూపించకపోతే లేదా నగదు జమ కాకపోతే రైతులు కంగారు పడాల్సిన పనిలేదు. మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రం లేదా గ్రామ, వార్డు సచివాలయంలో అధికారులను సంప్రదించవచ్చు. అక్కడ మీ ఈ-కేవైసీ (e-KYC) అప్డేట్ అయిందో లేదో ఒకసారి సరిచూసుకోవాలి. బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ లేకపోయినా సాంకేతిక కారణాల వల్ల నగదు ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారుల సాయంతో ఆ చిన్నపాటి సమస్యలను సరిచేసుకుంటే వెంటనే నగదు జమ అవుతుంది.
అంతేకాకుండా రైతుల ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నంబర్ను కూడా కేటాయించింది. ఎవరికైనా పథకం వర్తించకపోయినా లేదా ఇతర సమస్యలు ఉన్నా 155251 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అర్హత ఉండి పొరపాటున లిస్టులో పేరు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. వ్యవసాయాన్ని పండుగలా మార్చడమే తమ ధ్యేయమని, రైతులు అప్పుల పాలు కాకుండా ఈ పెట్టుబడి సాయం ఎంతో తోడ్పడుతుందని ప్రభుత్వం ఈ సందర్భంగా పేర్కొంది.