తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో బరితెగించి అక్రమాలకు పాల్పడిన మరొక అధికారిపై EC వేటు... కొద్ది రోజుల క్రితమే ఐఏఎస్ అధికారి గిరీశాపై వేటుపడిన సంగతి అందరికీ తేలిసిందే తాజాగా మరో అధికారి అయిన చంద్రమౌళీశ్వరరెడ్డి పై వేటు పడింది.
చంద్రమౌళీశ్వర్రెడ్డిని తాము ఈఆర్వోగా నియమించలేదని ఎన్నికల సంఘం స్పష్టం...
వీళ్ళు చేసిన పనులు బరితెగింపునకు పరాకాష్ఠ... ఎన్నడూ ఎరుగని ఎన్నికల మోసం... జగన్ ప్రభుత్వం, వైకాపా నాయకులు, అధికారులు కుమ్మక్కై సాగించిన అతి పెద్ద నేరపూరిత కుట్ర. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సమయంలో 35వేలకు పైగా ఓటరు గుర్తింపుకార్డులు అక్రమంగా డౌన్లోడ్ చేసి, వాటితో దొంగ ఓట్లు వేయించిన ఘటనలో తవ్వేకొద్దీ నివ్వెరపరిచే నిజాలు వెలుగుచూస్తున్నాయి. అసలు ఎన్నికల సంఘం ఈఆర్వోగా (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి)గా నియమించకుండానే... అప్పట్లో తిరుపతి నగరపాలక సంస్థ ఉప కమిషనర్గా పనిచేసిన పి. చంద్రమౌళీశ్వర్రెడ్డి... ఈఆర్వోగా బాధ్యతలు నిర్వహించేసి దొంగ ఓట్ల దందాకు తెరతీసినట్లు తేలింది.
దీంతో కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఆయనపై సస్పెన్షన్ వేటు వేయించింది. ఆయన ప్రస్తుతం మెప్మాలో సహాయ డైరెక్టర్గా ఉన్నారు. అసలు తాము నోటిఫై చేయకుండానే ఓ అధికారి ఈఆర్వో బాధ్యతలు నిర్వహిస్తుంటే ఎన్నికల సంఘానికి తెలియకపోవడమేంటి? ఇది ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియను హత్య చేయటం కాదా?
నగరపాలక సంస్థ ఉపకమిషనర్ గా పనిచేసే అధికారి... ఏకంగా ఎన్నికల సంఘాన్నే మోసగించే సాహసానికి ఒడిగట్టారంటే ప్రభుత్వ పెద్దల అండదండలు లేకుండా సాధ్యమేనా? మరి ఆ కుట్రదారుల్ని ఎందుకు బయటపెట్టట్లేదు?
తిరుపతి నగరపాలక సంస్థ ఉప కమిషనర్గా పనిచేసిన పి. చంద్రమౌళీశ్వర్రెడ్డిని తిరుపతి లోక నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి (ఏఆర్వో)గా, తిరుపతి శాసనసభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్వో)గా నియమిస్తూ 2021 మార్చి 17న ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. తిరుపతి శాసనసభ నియోజకవర్గానికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్వో)గా ఆయన్ను నియమించలేదు. అయినా చంద్రమౌళీశ్వర్రెడ్డి తనంతట తానే ఈఆర్వోగా బాధ్యతలు నిర్వర్తించేశారు. తన పేరు, ఫోన్ నెంబర్ ను ఈఆర్వో ప్రొఫైల్స్లో కనిపించేలా పెట్టుకున్నారు. ఇది అతి పెద్ద ఎన్నికల నేరం.
దొంగ ఓట్లు వేసే నేరపూరిత కుట్ర అమలుకు ఇక్కడే బీజం పడింది. గుర్తింపుకార్డులు అక్రమంగా డౌన్లోడ్ చేయటం, వాటితో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్చడం లాంటివి అన్ని జరిగాయి. ఈ వ్యవహారంలో చంద్రమౌళీశ్వర్రెడ్డి ప్రమేయంపై పోలీసులు లోతైన దర్యాప్తు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆ దర్యాప్తు పూర్తయ్యేవరకూ ఆయన్ను సస్పెండ్ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులిచ్చారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తిరుపతి లోక్సభ ఉపఎన్నికలు జరిగి మూడేళ్లవుతోంది. అప్పట్లో జరిగిన అక్రమాలపై ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. ఇటీవల బీజేపీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదివ్వటం, ఆ తర్వాత విజయవాడ వచ్చిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ దీనిపై విచారణకు ఆదేశించటంతో ఎట్టకేలకు ఈ కుట్ర బయటపడి, అందులోని పాత్రధారులు వెలుగుచూస్తున్నారు. లేదంటే ఈ మొత్తం కుట్ర సమాధైపోయేది.
ఉప ఎన్నికలు జరిగి మూడేళ్లవుతున్నా విచారణ జరిపేవరకూ... తాము ఈఆర్వోగా నోటిఫై చేయని వ్యక్తి ఆ బాధ్యతలు నిర్వహించాడనే విషయమే ఎన్నికల సంఘానికి తెలియలేదా? ఆథరైజేషన్ ఎవరు అప్పగించారు? దస్త్రాలు ఏమయ్యాయి? చంద్రమౌళీశ్వర్రెడ్డిని తాము ఈఆర్వోగా నియమించలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మరి ఆయన్ను ఈఆర్వోగా ఎవరు నియమించినట్లు? ఆయనకు ఆ ఆథరైజేషన్ ఎవరు ఇచ్చినట్లు? ఈఆర్వో లాగిన్ ఐడీ, పాస్వర్డ్లు ఆయనకు ఎక్కడివి? వీటికి సంబంధించి ఏవైనా దస్త్రాలు నడిచాయా? అవి ఎక్కడున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానమే లేదు. ఇదే వ్యవహారంలో ఇప్పటికే ఐఏఎస్ అధికారి గిరీషా సస్పెన్షన్ కు గురయ్యారు. ఇప్పుడు చంద్రమౌళీశ్వర్రెడ్డి సస్పెండ్ అయ్యారు. వీరి వెనక ఉన్న అసలు కుట్రదారుల పాత్ర కూడా బయటకు రావాలి.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి