Ambedkar Jayanti 2026: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని ఈ ఏడాది ఏప్రిల్ 14, మంగళవారం నాడు దేశప్రజలు ఘనంగా జరుపుకోనున్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి, సమాజంలో సమానత్వం కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడికి నివాళిగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు మార్కెట్లకు సంబంధించి కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏ సేవలు అందుబాటులో ఉంటాయో ముందుగానే తెలుసుకోవడం మంచిది సుమీ…
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక సంస్థలు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలతో పాటు కోర్టులు, పోస్టాఫీసులు కూడా మంగళవారం పని చేయవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్యాలెండర్ ప్రకారం, దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో బ్యాంకులు మూతపడతాయి. అయితే, డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ ఏటీఎం సేవలు యథావిధిగా కొనసాగుతాయి.
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు కూడా ఈ సెలవును గమనించాల్సి ఉంటుంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లలో మంగళవారం ఎటువంటి ట్రేడింగ్ జరగదు. ఈక్విటీ, డెరివేటివ్స్ కరెన్సీ మార్కెట్లు పూర్తిగా మూసివేయబడతాయి. మళ్ళీ బుధవారం ఉదయం నుండే సాధారణ లావాదేవీలు ప్రారంభమవుతాయి. వ్యాపార వర్గాలు పెట్టుబడిదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరోవైపు, సామాన్య ప్రజలకు అవసరమైన అత్యవసర సేవల్లో ఎటువంటి అంతరాయం ఉండదు. ఆసుపత్రులు, మెడికల్ షాపులు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే.. బస్సులు, రైళ్లు క్యాబ్ సేవలు ఎప్పటిలాగే నడుస్తాయి. పెట్రోల్ బంకులు కూడా తెరిచే ఉంటాయి. స్థానిక నిబంధనల ప్రకారం ప్రైవేట్ సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ చిన్న వ్యాపార సంస్థలు పనిచేసే అవకాశం ఉంది. అయితే కార్యాలయ సిబ్బందికి సెలవు ఇచ్చే విషయంలో ఆయా సంస్థల సొంత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.
అంబేద్కర్ జయంతితో పాటు, ఈ రోజు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రాంతీయ పండుగల సందడి కూడా నెలకొంది. తమిళ నూతన సంవత్సరం, బైసాఖీ, బొహాగ్ బిహు వంటి పండుగలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన కృషిని స్మరించుకుంటూ, మరోవైపు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ భారతీయులు ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకోనున్నారు. సెలవు కారణంగా ప్రజలు తమ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.