వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలతో అణు పరీక్షలపై గందరగోళం నెలకొంది. అయితే, అమెరికా ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ దీనిపై స్పష్టతనిచ్చారు. ఆయన తెలిపినదేమిటంటే, ప్రభుత్వం ప్రణాళికలో ఉన్న పరీక్షలు అణు పేలుళ్లు కాని సిస్టమ్ టెస్టులు మాత్రమేనని చెప్పారు.
ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రైట్ చెప్పారు
మేము చేస్తున్న పరీక్షలు అణు పేలుళ్లు కావు. ఇవి నాన్-క్రిటికల్ టెస్టులు మాత్రమే. అంటే అణు శక్తి లేకుండా ఆయుధ వ్యవస్థను పరీక్షించడం అని ఆయన వివరించారు.
అమెరికా కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఆయుధ వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయా అవి పాత వాటికంటే మెరుగ్గా ఉన్నాయా అన్నదే ఈ పరీక్షల ప్రధాన ఉద్దేశమని రైట్ తెలిపారు.
గత వారం ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ లో ఒక సందేశం పోస్ట్ చేశారు. అందులో ఆయన అమెరికా తన అణు ఆయుధాలను తిరిగి పరీక్షించమని ఆదేశించాను అని రాశారు. ఈ వ్యాఖ్యతో అమెరికా తిరిగి అణు పరీక్షలు ప్రారంభించబోతోందా అన్న సందేహం దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చెందింది.
ఆ తర్వాత ఆయన ఈ వ్యాఖ్యను పునరుద్ధరించినప్పటికీ, భూగర్భ అణు పరీక్షలు జరుగుతాయా అని అడగగా, స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అమెరికా 1960ల నుండి 1980ల మధ్య వందలాది అణు పరీక్షలు చేసింది. ఆ సమయంలో సేకరించిన సమాచారం, డేటా ఇప్పటికీ దేశానికి అణు సాంకేతికతలో పునాది వలె నిలిచింది.
ట్రంప్ వ్యాఖ్యలతో చైనా, రష్యా వంటి అణు శక్తి దేశాలు ఉత్కంఠతో ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే అమెరికా అధికారులు మాత్రం ఇది సాధారణ భద్రతా పరీక్ష మాత్రమేనని అణు పేలుళ్లు చేయాలన్న ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.