Middle East Crisis: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు ఇచ్చిన 48 గంటల గడువు ఈ రాత్రి ముగియనుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ ఇరాన్ వెనక్కి తగ్గకపోతే, ఆ దేశ నాగరికతనే అంతం చేస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే ఇరాన్ చరిత్రలో ఇది అత్యంత చీకటి రాత్రి అవుతుందని ఆయన హెచ్చరించారు.
ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో స్పందిస్తూ.. ఇరాన్లో దశాబ్దాలుగా సాగుతున్న అరాచక పాలనకు ముగింపు పలికే సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వం మారాల్సిన అవసరం ఉందని, కొత్తగా వచ్చే తెలివైన నేతలతో ఆ దేశ భవిష్యత్తు అద్భుతంగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధం చేయడం తనకు ఇష్టం లేకపోయినా, అమెరికా ప్రయోజనాల దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని, ఇరాన్ ప్రజలను ఆ దేవుడే రక్షించాలని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికా తీరుపై ఐక్యరాజ్యసమితి (UN) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నేరమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు. యుద్ధ నేరాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సూచించినప్పటికీ, ట్రంప్ మాత్రం తాను దేనికీ భయపడటం లేదని స్పష్టం చేశారు. ఇరాన్లోని ప్రతి విద్యుత్ కేంద్రం, వంతెన తమ లక్ష్యంగా ఉంటాయని ఆయన పరోక్షంగా బాంబు దాడుల సూచన ఇచ్చారు.
మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. అమెరికా బెదిరింపులకు లొంగే ప్రసక్తి లేదని ఆ దేశ అధికారులు తెగేసి చెబుతున్నారు. కేవలం తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపడం కాకుండా, శాశ్వత పరిష్కారం కావాలని వారు పట్టుబడుతున్నారు. ఈ లోపే ఇరాన్ చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపం సమీపంలో భారీ పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది అమెరికా హెచ్చరికల ఫలితమేనా లేక ఇతర కారణాలు ఉన్నాయా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.
మొత్తానికి మంగళవారం రాత్రి 8 గంటల లోపు ఇరాన్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే పరిస్థితులు చేయి దాటిపోయేలా ఉన్నాయి. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అనారోగ్యంతో ఉన్నారనే వార్తలు, మరోవైపు పాకిస్థాన్ వంటి పొరుగు దేశాలు ఈ యుద్ధ ప్రభావంతో లాక్డౌన్లు ప్రకటించడం చూస్తుంటే.. ఈ రాత్రి ప్రపంచ చరిత్రలో అత్యంత కీలకమైనదిగా మారనుంది. ఏం జరగబోతుందోనని యావత్ ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తోంది.