Techie: రూ.2.5 లక్షల జీతం వదిలి కొత్త జీవితం.. కార్పొరేట్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పిన టెకీ!

Techie: అధిక జీతం, మంచి ఉద్యోగం, విదేశీ క్లయింట్లు, స్థిరమైన జీవితం… చాలామందికి ఇవే విజయానికి గుర్తులు. కానీ కొంతమందికి మాత్రం డబ్బు కంటే మనశ్శాంతి ముఖ్యం అవుతుంది. అలాంటి అరుదైన నిర్ణయం తీసుకుని ఇప్పుడు తనకిష్టమైన జీవితాన్ని గడుపుతోంది బెంగళూరుకు చెందిన అపేక్ష జైన్.

Published : 2026-05-15 15:58:00

నెలకు రూ.2.5 లక్షల జీతం వచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి దేశమంతా తిరుగుతూ..

నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదించడం..

అధిక జీతం, మంచి ఉద్యోగం, విదేశీ క్లయింట్లు, స్థిరమైన జీవితం… చాలామందికి ఇవే విజయానికి గుర్తులు. కానీ కొంతమందికి మాత్రం డబ్బు కంటే మనశ్శాంతి ముఖ్యం అవుతుంది. అలాంటి అరుదైన నిర్ణయం తీసుకుని ఇప్పుడు తనకిష్టమైన జీవితాన్ని గడుపుతోంది బెంగళూరుకు చెందిన అపేక్ష జైన్.

11 సంవత్సరాల పాటు టెక్ రంగంలో పనిచేసిన అపేక్ష జైన్, నెలకు రూ.2.5 లక్షల జీతం వచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి దేశమంతా తిరుగుతూ కొత్త జీవితం మొదలుపెట్టింది. జేపీ మోర్గాన్ చేస్ & కో, యాక్సెంచర్, విప్రో వంటి ప్రముఖ కంపెనీల్లో పనిచేసిన ఆమె 2023లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి ప్రయాణ జీవితం ఎంచుకుంది.

హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అపేక్ష తన అనుభవాలను పంచుకుంది. “11 సంవత్సరాల కార్పొరేట్ అనుభవం ఉంది. చివరిగా నేను తీసుకున్న జీతం నెలకు సుమారు రూ.2.5 లక్షలు,” అని ఆమె తెలిపింది.

నాగ్‌పూర్‌కు చెందిన అపేక్ష తన ఉద్యోగ జీవితంలో పుణె, చెన్నై, ముంబై, నోయిడా, లండన్ వంటి నగరాల్లో పనిచేసింది. టెక్ రంగంలో చాలామంది కలలు కనే జీతం, ప్రమోషన్లు, స్థిరమైన కెరీర్ ఆమెకూ దక్కాయి. కానీ కాలక్రమేణా ఉద్యోగం తనకు ఆనందం ఇవ్వడం లేదని ఆమె గుర్తించింది.

“నేను చేస్తున్న పనికి, నా జీవితానికి మధ్య ఒక దూరం పెరుగుతున్నట్టు అనిపించింది. యూకే, యూఎస్ క్లయింట్ల కోసం పనిచేస్తున్నాను కానీ నేను రూపొందిస్తున్న ప్రొడక్ట్స్‌ను చివరకు ఎవరు ఉపయోగిస్తున్నారో కూడా తెలియదు. ఆ పని నాకు అర్థవంతంగా అనిపించలేదు,” అని అపేక్ష చెప్పింది.

ఉద్యోగ జీవితంలో ఎనిమిదో సంవత్సరం నుంచి బెంగళూరు చుట్టుపక్కల చిన్న చిన్న ట్రిప్స్ చేయడం ఆమె ఆలోచనలను మార్చేసింది. ప్రయాణాల్లో ఆమెకు లభించిన ప్రశాంతత, ఆనందం ఉద్యోగంలో కనిపించలేదని తెలిపింది.

పర్యాటక ప్రదేశాలు చూసి వెంటనే తిరిగి రావడం కాకుండా, అక్కడే కొంతకాలం ఉండి స్థానిక సంస్కృతి, జీవన విధానాన్ని దగ్గరగా అనుభవించాలని ఆమె కోరుకుంది. అదే సమయంలో ఆమె జీవితంలో మరో పెద్ద విషాదం చోటుచేసుకుంది. కరోనా రెండో దశలో ఆమె తల్లి మరణించారు. ఆ సంఘటన ఆమెను లోపల నుంచి బాగా కుదిపేసింది.

తల్లి మరణం తర్వాత జీవితం, సంతోషం, విజయానికి అర్థం ఏమిటో మరోసారి ఆలోచించానని అపేక్ష తెలిపింది. ఎన్నో సంవత్సరాల మానసిక ఒత్తిడి, బర్నౌట్ తర్వాత చివరకు 2023లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి ప్రయాణ జీవితం ప్రారంభించానని చెప్పింది.

అయితే ఈ నిర్ణయం ఒక్కసారిగా తీసుకున్నది కాదని ఆమె స్పష్టం చేసింది. ఉద్యోగం వదిలే ముందు నాలుగేళ్ల పాటు జాగ్రత్తగా డబ్బు సేవ్ చేసిందని తెలిపింది. అదే సమయంలో తండ్రి హౌస్ లోన్ చెల్లింపులు, సోదరుల చదువుల ఖర్చులను కూడా చూసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. ఈ కుటుంబ బాధ్యతల కారణంగా చివరకు సుమారు రూ.5 లక్షలు మాత్రమే సేవ్ చేయగలిగానని వెల్లడించింది.

ప్రయాణ జీవితం మొదలుపెట్టే ముందు ఖర్చులను కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంది. హాస్టల్ ఖర్చులు, ఆహారం, ఆరోగ్య అత్యవసరాలు, ఇతర అవసరాల కోసం ఎంత ఖర్చవుతుందో లెక్క వేసుకుని అదనంగా 20 శాతం బఫర్ కూడా పెట్టుకుందని తెలిపింది. కనీసం 8 నుంచి 9 నెలలు బడ్జెట్ ట్రావెల్ చేయగలననే నమ్మకం వచ్చిన తర్వాతే ఉద్యోగం వదిలానని చెప్పింది.

ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత స్పీతి, మనాలి, నైనిటాల్ వంటి ప్రాంతాల్లో ప్రయాణం ప్రారంభించింది. అక్కడ హాస్టల్స్, కేఫేలలో వాలంటీర్‌గా పనిచేసింది. తర్వాత ట్రావెల్ స్టేల్లో ప్రాపర్టీ మేనేజర్, టీమ్ మేనేజర్‌గా పని చేయడం మొదలుపెట్టింది.

మొదట్లో సేవింగ్స్‌పై ఆధారపడినా, తర్వాత తాత్కాలిక పనుల ద్వారా ఆదాయం సంపాదించడం ప్రారంభించిందని తెలిపింది. “ప్రారంభంలో సేవింగ్స్ నుంచి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. తర్వాత నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదించడం మొదలైంది. ఇప్పుడు నేను చేసే అదనపు పనులే నా ప్రధాన ఆదాయ వనరుగా మారాయి,” అని అపేక్ష చెప్పింది.

ఇప్పటి ఆదాయం గతంతో పోలిస్తే చాలా తక్కువ అయినప్పటికీ తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఆమె చెబుతోంది. జీవితంలో ప్రతి దశలో విజయానికి అర్థం మారుతుందని, ఒకప్పుడు ప్రమోషన్లు, జీతం ముఖ్యం అనిపించగా ఇప్పుడు ప్రశాంత జీవితం, మనసుకు నచ్చిన పని ఎక్కువ ఆనందం ఇస్తోందని తెలిపింది.

“కార్పొరేట్ ఉద్యోగాల వల్లే నేను ఈ బ్రేక్ తీసుకోగలిగాను. అందుకు నేను కృతజ్ఞురాలిని. కానీ ఒక దశ తర్వాత ఆ ఉద్యోగాలు మనసును ఖాళీ చేస్తున్నట్టు అనిపిస్తాయి. ఇప్పుడు నేను గడుపుతున్న జీవితం మరింత సంతృప్తినిస్తోంది,” అని అపేక్ష భావోద్వేగంగా చెప్పింది.

అయితే ట్రావెల్ జీవితం సోషల్ మీడియాలో కనిపించేంత సులభం కాదని కూడా ఆమె హెచ్చరించింది. ఇందులో అనిశ్చితి, సవాళ్లు చాలానే ఉంటాయని, ఇలాంటి నిర్ణయాలు భావోద్వేగంతో కాకుండా సరైన ప్రణాళికతో మాత్రమే తీసుకోవాలని యువతకు సూచించింది.

Spotlight

Read More →