Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: సౌదీ అరేబియాలోని రియాద్ జైలులో ఉన్న నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన అంబులెన్స్ డ్రైవర్ కుమ్మరి శ్రవణ్ కుమార్‌పై విధించిన 3,30,000 సౌదీ రియాళ్ల (సుమారు రూ.84 లక్షలు) ‘దియా’ మొత్తాన్ని మాఫీ చేయించి, ఆయన విడుదలకు చర్యలు తీసుకోవాలని భార్య వెన్నంకి మమత హైదరాబాద్ బేగంపేట ప్రజా భవన్‌లో నిర్వహించిన ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు.

Published : 2026-05-29 20:17:00
  • రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇద్దరు సౌదీ పౌరుల కుటుంబాలకు రూ.84 లక్షల ‘దియా’ (బ్లడ్ మనీ) చెల్లించాలని కోర్టు ఆదేశం..
     
  • Gulf: జరిమానా చెల్లించే వరకు శ్రవణ్ కుమార్‌పై ట్రావెల్ బ్యాన్..

Gulf Updates: సౌదీ అరేబియాలోని రియాద్ జైలులో ఉన్న నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన అంబులెన్స్ డ్రైవర్ కుమ్మరి శ్రవణ్ కుమార్‌పై విధించిన 3,30,000 సౌదీ రియాళ్ల (సుమారు రూ.84 లక్షలు) ‘దియా’ మొత్తాన్ని మాఫీ చేయించి, ఆయన విడుదలకు చర్యలు తీసుకోవాలని భార్య వెన్నంకి మమత హైదరాబాద్ బేగంపేట ప్రజా భవన్‌లో నిర్వహించిన ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు.

2024 మే 6న రియాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సౌదీ జాతీయులు మరణించగా, ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. ఈ కేసులో శ్రవణ్ కుమార్‌పై సౌదీ కోర్టు భారీ జరిమానా విధించింది. జరిమానా చెల్లించే వరకు ఆయన దేశం విడిచి వెళ్లకుండా ట్రావెల్ బ్యాన్ కూడా అమలులో ఉంది. ఇటీవల ఆయనను పోలీసులు అరెస్టు చేసి రియాద్ జైలుకు తరలించారు.

భర్తకు న్యాయ సహాయం, కాన్సులార్ యాక్సెస్ కల్పించి విడుదల చేసి భారత్‌కు తీసుకురావాలని మమత విజ్ఞప్తి చేశారు. సమస్యపై స్పందించిన ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి. శేషాద్రికి లేఖ రాశారు. బాధిత కుటుంబానికి, తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమంలో 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' హెల్ప్ డెస్క్ లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, వాలంటీర్ కర్రి పద్మా రాణి, కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

గత రెండేళ్లుగా కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, రూ.84 లక్షల జరిమానా చెల్లించే స్థోమత తమకు లేదని పేర్కొన్న మమత, మానవతా దృక్పథంతో దౌత్యపరమైన ప్రయత్నాల ద్వారా ‘దియా’ మొత్తాన్ని మాఫీ చేయించి శ్రవణ్ కుమార్ విడుదలకు సహకరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

Spotlight

Read More →