రాష్ట్రపతి భవన్లో ఘనంగా తొలి సివిల్ ఇన్వెస్టిచర్ కార్యక్రమం..
66 మంది ప్రముఖులకు నేడు పద్మ పురస్కారాలు..
భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రధానోత్సవం ఈరోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరగనుంది. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తొలి సివిల్ ఇన్వెస్టిచర్ కార్యక్రమంలో ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను ఈ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరిస్తోంది.
ఈరోజు జరిగే తొలి విడత కార్యక్రమంలో మొత్తం 66 పద్మ అవార్డులు అందజేయనున్నారు. వీటిలో 2 పద్మ విభూషణ్, 6 పద్మ భూషణ్, 58 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. మిగిలిన అవార్డులను తర్వాత నిర్వహించే రెండో విడత సివిల్ ఇన్వెస్టిచర్ కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో 5 పద్మ విభూషణ్, 13 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలు ఉండగా, 16 మందికి మరణానంతరం పురస్కారాలు ప్రకటించడం ప్రత్యేకతగా నిలిచింది.
1954లో ప్రారంభమైన పద్మ అవార్డులు ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడలు, సామాజిక సేవ, శాస్త్ర సాంకేతిక రంగం, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం వంటి అనేక రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి ఈ గౌరవాన్ని అందజేస్తారు.
దేశ అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులను గుర్తించి సత్కరించడం ద్వారా యువతకు స్ఫూర్తినివ్వడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, కేంద్ర మంత్రులు, అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు.