NEET: దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు.. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో కలకలం!

NEET: దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైన నీట్ పరీక్ష వివాదం మరింత ముదిరింది. ఈ నెల 3న నిర్వహించిన నీట్ పరీక్షను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Published : 2026-05-12 14:07:00

రాజస్తాన్ నీట్ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణతో రద్దు..

కోటాలోని కోచింగ్ సెంటర్లు ఇచ్చిన మెటీరియల్‍తో పోలిఉన్నట్లు గుర్తింపు..

దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైన నీట్ పరీక్ష వివాదం మరింత ముదిరింది. ఈ నెల 3న నిర్వహించిన నీట్ పరీక్షను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్‌లో ప్రశ్నపత్రం లీక్ జరిగినట్లు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

రాజస్థాన్‌లోని కోటా కేంద్రంగా జరిగిన ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నీట్ పరీక్షలో వచ్చిన ప్రశ్నల్లో దాదాపు 600 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు ముందుగానే లీక్ అయినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఈ వ్యవహారంపై రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సల్ కీలక వివరాలు వెల్లడించారు. కోటాలోని కొన్ని కోచింగ్ సెంటర్లు అందించిన మెటీరియల్‌తో అసలు ప్రశ్నపత్రం చాలా వరకు సరిపోలినట్లు గుర్తించామని చెప్పారు. ముఖ్యంగా కెమిస్ట్రీ విభాగంలో 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఒక ప్రాక్టీస్ పేపర్ అసలు ప్రశ్నలకు దగ్గరగా ఉండటం అనుమానాలకు బలం చేకూర్చింది.

పరీక్షకు దాదాపు 42 గంటల ముందే వాట్సాప్ ద్వారా ఈ మెటీరియల్ పంపిణీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రశ్నపత్రాన్ని రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకు అమ్మినట్లు సమాచారం బయటకు వచ్చింది. కొంతమంది అభ్యర్థుల నుంచి ముందస్తుగా రూ.30 వేల వరకు వసూలు చేసినట్లు కూడా విశాల్ బన్సల్ వెల్లడించారు.

ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష నిర్వహణలో జరిగిన లోపాలు, లీక్ వెనుక ఉన్న నెట్వర్క్‌ను వెలికితీయడానికి ప్రత్యేక దర్యాప్తు చేపట్టనున్నారు.

ఇక పరీక్ష రద్దుతో లక్షలాది విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. నెలల తరబడి కష్టపడి సిద్ధమైన విద్యార్థులు మళ్లీ పరీక్షకు హాజరు కావాల్సిన పరిస్థితి రావడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

Spotlight

Read More →