జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మరో అవకాశం లభించింది. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 9వ, 11వ తరగతులలో లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాల కోసం జవహర్ నవోదయ విద్యాలయ సమితి (JNV) విడుదల చేసిన అడ్మిషన్ నోటిఫికేషన్ గడువును మరోసారి పొడిగించింది. మొదట సెప్టెంబర్ 23తో ముగిసిన దరఖాస్తు గడువును, తరువాత అక్టోబర్ 7 వరకు పొడిగించారు. ఇప్పుడు విద్యార్థుల అభ్యర్థన మేరకు తాజాగా అక్టోబర్ 21, 2025 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఒక పెద్ద అవకాశం అని అధికారులు పేర్కొన్నారు.
జవహర్ నవోదయ విద్యాలయాల లక్ష్యం, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడం. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 653 నవోదయ విద్యాలయాలు ఉన్నాయని, వీటిలో ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 9 ఉన్నాయని వివరాలు తెలిపాయి. ప్రతి సంవత్సరం ఈ విద్యాలయాల్లో 9వ మరియు 11వ తరగతుల ఖాళీ సీట్ల భర్తీ కోసం లేటరల్ ఎంట్రీ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఉచిత విద్య, వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫామ్ వంటి సౌకర్యాలు పూర్తిగా ఉచితంగా కల్పిస్తారు.
అర్హతలు విషయానికి వస్తే, దరఖాస్తు చేసుకునే విద్యార్థి తాను చదివే జిల్లాకు చెందిన స్థానిక విద్యార్థి అయి ఉండాలి. 2025–26 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి (9వ తరగతి ప్రవేశం కోసం) లేదా 10వ తరగతి (11వ తరగతి ప్రవేశం కోసం) చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. అలాగే, అభ్యర్థులు 2011 మే 1 నుంచి 2013 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ప్రవేశ పరీక్ష వివరాలు కూడా ప్రకటించారు. ఈ పరీక్ష 100 మార్కులకు నిర్వహించబడుతుంది. మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్ మరియు హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా, ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉండదు. పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 2026న దేశవ్యాప్తంగా ఒకే సమయంలో నిర్వహించనున్నారు. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.