CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు!

CM Vijay: ఆదాయ వివరాలను దాచిపెట్టారనే ఆరోపణలతో తమిళనాడు సీఎం, ప్రముఖ నటుడు విజయ్ పై దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు విచారణ సందర్భంగా ఉపసంహరించుకోవడంతో కేసు ముగిసింది.

Published : 2026-06-02 20:56:00

విజయ్‌పై మనీల్యాండరింగ్ దర్యాప్తు కోరిన పిటిషన్ వెనక్కి..

సీఎం విజయ్‌కు ఊరట.. పిటిషన్ ఉపసంహరణకు హైకోర్టు అనుమతి..

ఆదాయ వివరాలను దాచిపెట్టారనే ఆరోపణలతో తమిళనాడు సీఎం, ప్రముఖ నటుడు దళపతి విజయ్ పై దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు విచారణ సందర్భంగా ఉపసంహరించుకోవడంతో కేసు ముగిసింది. ఈ పిటిషన్‌లో మనీల్యాండరింగ్ చట్టం కింద దర్యాప్తు చేపట్టాలని కోరుతూ దాఖలైన అభ్యర్థనను కోర్టు ఇకపై పరిశీలించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఈ కేసును చీఫ్ జస్టిస్ ఎస్.ఏ. ధర్మాధికారి, జస్టిస్ జీ. అరుల్ మురుగన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. విచారణ ప్రారంభమైన అనంతరం పిటిషనర్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది.

పిటిషనర్ వాదన ప్రకారం, 2015లో ఆదాయపన్ను శాఖ అధికారులు విజయ్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో సుమారు రూ.15 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆ మొత్తం ‘పులి’ సినిమా పారితోషికానికి సంబంధించినదిగా భావిస్తున్నట్లు పిటిషన్‌లో ప్రస్తావించారు.

ఈ వ్యవహారంపై మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు జరపాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే విచారణ సమయంలోనే పిటిషనర్ తన అభ్యర్థనను వెనక్కి తీసుకోవడంతో కేసు ముగిసింది. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Spotlight

Read More →