TDP: లిక్కర్ స్కామ్‌లో కొత్త కోణాలు.. కేఎన్ఆర్ ఆస్తులపై తీవ్ర ఆరోపణలు.. పట్టాభి కీలక వ్యాఖ్యలు!

TDP: గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు.

Published : 2026-05-29 19:14:00

కేఎన్ఆర్ కుటుంబ ఖాతాల్లో రూ.20 కోట్ల లావాదేవీలు?..

లిక్కర్ స్కామ్‌లో సంచలన ఆరోపణలు చేసిన పట్టాభిరామ్..

మంగళగిరి: గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ వంటి వ్యక్తుల పాత్రపై అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని, తాజాగా జగన్ రెడ్డి మాజీ పీఏ కే. నాగేశ్వర్ రెడ్డి (కేఎన్ఆర్) పేరు కూడా ప్రధానంగా బయటకు వస్తోందని తెలిపారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడి చుట్టూ ఉండే అత్యంత సన్నిహితుల్లో కేఎన్ఆర్ ఒకరని ఆరోపించారు.

ప్రాథమిక విచారణలోనే ఈ లిక్కర్ కుంభకోణం విలువ దాదాపు రూ.3,500 కోట్లుగా తేలిందని పట్టాభిరామ్ పేర్కొన్నారు. ప్రజల డబ్బు అనేక ఖాతాల్లోకి మళ్లించబడినట్లు ఆధారాలు లభించాయని చెప్పారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఖాతాల్లోకి వెళ్లిన నిధుల వివరాలు కూడా బయటపడినట్లు వెల్లడించారు.

కేఎన్ఆర్ మరియు ఆయన భార్య పేరిట భారీ ఆస్తులు ఉన్నాయని, వారి బ్యాంకు ఖాతాల్లో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో బయటపడిందని అన్నారు. ముఖ్యంగా 2019 నుంచి 2024 మధ్య కాలంలో కేఎన్ఆర్ భార్య ఖాతాలోకి దాదాపు రూ.20 కోట్ల మేర నగదు బదిలీలు జరిగినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం సిట్ (SIT) దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

జగ్గయ్యపేట పరిసరాల్లో 40 ఎకరాలకు పైగా భూములు, తిరుపతిలో 10 ఎకరాలు, దర్శి, భోగాపురం ప్రాంతాల్లో మరిన్ని భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. అదేవిధంగా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, కడప, తిరుపతి నగరాల్లో విల్లాలు, అపార్ట్‌మెంట్లు, ఇళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. రెండు కిలోల బంగారం కూడా స్వాధీనం అయినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ, కేఎన్ఆర్‌కు ఆస్తులు లేవని ఎక్కడా ఖండించలేదని పట్టాభిరామ్ అన్నారు. దీంతో ఆస్తులు ఉన్న విషయాన్ని వాళ్లే అంగీకరించినట్టేనని వ్యాఖ్యానించారు.

“నెలకు రూ.10 నుంచి రూ.15 వేల జీతం తీసుకునే జర్నలిస్టు, ఐదేళ్లలో వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడు?” అని ప్రశ్నించారు. చిన్న చిన్న వ్యాపారాల ద్వారా సంపాదించానని చెప్పడం ప్రజలు నమ్మరని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న సీనియర్ జర్నలిస్టులకు ఇప్పటికీ సొంత ఇళ్లు కూడా లేవని గుర్తు చేశారు.

చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన P4 అంటే “పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్” అని, పేద కుటుంబాలను ఆదుకునేందుకు ఆ పథకం పనిచేస్తోందని చెప్పారు. కానీ గత ప్రభుత్వం మాత్రం “పవర్, ప్రాపర్టీ, పైసా పార్ట్నర్షిప్”తో అధికారాన్ని ఉపయోగించి అక్రమ ఆస్తులు కూడబెట్టిందని విమర్శించారు.

తాడేపల్లి ప్యాలెస్‌లోకి ఎవరైనా వెళ్లాలంటే కేఎన్ఆర్ అనుమతి తప్పనిసరి అన్న పరిస్థితి ఉండేదని ఆరోపించారు. “పర్సనల్ అసిస్టెంట్ కాదు.. పర్సెంటేజ్ అసిస్టెంట్” అంటూ కేఎన్ఆర్‌పై విమర్శలు గుప్పించారు. లిక్కర్ సిండికేట్ దగ్గర నుంచి భారీ వసూళ్లు జరిగాయని అన్నారు.

గత ఐదేళ్లలో నాసిరకం మద్యం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని పట్టాభిరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేఎన్ఆర్ ఖాతాల్లోకి వెళ్లిన డబ్బు ప్రజల ప్రాణాలతో సంబంధం ఉన్న “రక్తపు సొమ్ము” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సిట్ అధికారులు దర్యాప్తును చాలా పద్ధతిగా నిర్వహిస్తున్నారని, అన్ని ఆధారాలు, మనీ ట్రయల్ వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. కేఎన్ఆర్ అక్రమాస్తులకు సంబంధించిన పత్రాలు అధికారుల చేతిలో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటకు వస్తాయని, అసలు సూత్రధారుల వరకు విచారణ చేరుతుందని హెచ్చరించారు.

లిక్కర్ స్కామ్‌పై తాము లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రత్యర్థి నేతలు విమర్శలు చేస్తున్నారని పట్టాభిరామ్ మండిపడ్డారు. ఈ వ్యవహారంలో చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Spotlight

Read More →