రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులకు రూ.258 కోట్ల ఆర్థిక సాయం..
మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టిన ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన “మత్స్యకారుల సేవలో” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీతో కలిసి పాల్గొన్న మంత్రి, మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై మాట్లాడారు.
వేట నిషేధ కాలంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకారులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున భృతి అందిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.31 లక్షల మంది మత్స్యకారులకు రూ.258 కోట్లు విడుదల చేయడం ఆనందకరమని చెప్పారు.
గంగమ్మను నమ్ముకుని జీవించే మత్స్యకారుల పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు ప్రత్యేకమైన అభిమానముందని మంత్రి తెలిపారు. గతంలో బియ్యం మాత్రమే అందించేవారని, 2014లో వేట నిషేధ భృతి రూ.4 వేలుగా పెంచినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు మత్స్యకారుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అదే మొత్తాన్ని రూ.20 వేలకు పెంచామని వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జీవో నెం.217 ద్వారా మత్స్యకారుల చెరువులు, రిజర్వాయర్లను ఆన్లైన్ వేలం ద్వారా ఇతరులకు అప్పగించే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీవోను రద్దు చేసి మత్స్యకారుల హక్కులను కాపాడిందన్నారు. సముద్రంలో ఉప్పుగాలి ప్రభావంతో కంటి చూపు దెబ్బతింటోందని గుర్తించి, మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు.
గత ఐదేళ్లలో వేట నిషేధ భృతి కోసం మత్స్యకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి ఆరోపించారు. కొన్ని పథకాలు పొందుతున్నారనే కారణంతో భృతి నిలిపివేసిన ఘటనలు జరిగాయని చెప్పారు. సముద్రంలో వేటకు వెళ్లి కనిపించకుండా పోయిన వారికి మరణ ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వకుండా కుటుంబాలను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు 95 మందికి ధృవీకరణ పత్రాలు ఇచ్చి ఆర్థిక సహాయం అందించామని వివరించారు.
మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రధాన మంత్రి మత్స్యయోజన పథకాన్ని సమర్థంగా వినియోగిస్తున్నామని మంత్రి చెప్పారు. రూ.1.20 కోట్ల విలువైన ఫిషింగ్ బోట్లను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, సీ వీడ్ పెంపకానికి కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అందుతోందని తెలిపారు.
కృష్ణా జిల్లాలోనే ఈరోజు 18 వేల మంది మత్స్యకారులకు రూ.36 కోట్లు జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు. అవనిగడ్డ నుంచి పెడన వరకు సముద్ర తీర ప్రాంత మత్స్యకారుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. రూ.2.75 కోట్లతో పీతల హేచరీ ఏర్పాటుకు అనుమతులు వచ్చినట్లు తెలిపారు. అవసరమైన చోట శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, మహిళలు మరియు దళితులకు పడవల కొనుగోలుపై 60 శాతం వరకు సబ్సిడీ అందిస్తున్నామని వెల్లడించారు.
మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అక్కడ స్పీడ్ బోట్ల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయని, బోట్ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి మత్స్యకారులకు అవసరమైన పడవలను స్థానికంగానే నిర్మించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణతో పాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.