DSC: స్పోర్ట్స్ కోటా నియామకాలలో రాజకీయ జోక్యానికి తావులేదు.. డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వ స్పష్టీకరణ!

DSC: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఇటీవల వచ్చిన విమర్శలు, సందేహాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరణ ఇచ్చింది. నియామక ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా నిర్వహించామని రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు.

Published : 2026-06-01 20:55:42

స్పోర్ట్స్ కోటా నియామకాలలో రాజకీయ జోక్యానికి తావులేదు..

ఆన్‌లైన్ విధానంతో నిష్పక్షపాతంగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికలు..

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఇటీవల వచ్చిన విమర్శలు, సందేహాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరణ ఇచ్చింది. నియామక ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా నిర్వహించామని రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో శాప్ వైస్ చైర్మన్ & ఎండీ భరణితో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రతి దశను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించామని తెలిపారు.

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం నుంచి పోస్టు ఎంపిక వరకు ఎక్కడా వ్యక్తిగత సంప్రదింపులు లేకుండా వ్యవస్థను రూపొందించామని చెప్పారు. OTP ఆధారిత భద్రతతో అభ్యర్థులు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారని, అర్హతల ప్రకారం పోస్టులు ఆటోమేటిక్‌గా కనిపించేలా సాఫ్ట్‌వేర్ రూపొందించామని వివరించారు. దీంతో మానవ జోక్యానికి అవకాశం లేకుండా పారదర్శకతను కాపాడామని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 2024 డిసెంబర్‌లో కొత్త క్రీడా విధానాన్ని అమలు చేసిందని అజయ్ జైన్ తెలిపారు. “స్పోర్ట్స్ ఫర్ ఆల్” లక్ష్యంగా యువతను క్రీడల వైపు ఆకర్షించడం, మహిళా మరియు పారాస్పోర్ట్స్ క్రీడాకారులకు ప్రాధాన్యం ఇవ్వడం, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఏర్పాటు చేయడం, ఉద్యోగ అవకాశాలు పెంచడం వంటి అంశాలను ఇందులో పొందుపరిచామని చెప్పారు. క్రీడాకారుల రిజర్వేషన్‌ను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచడం కీలక నిర్ణయమని తెలిపారు.

డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో గుర్తించిన 65 క్రీడా విభాగాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినవి కాదని, కేంద్ర ప్రభుత్వం 2024 మార్చి 4న విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారమే గుర్తించామని వివరించారు. వాటిని కేటగిరి-ఏ, కేటగిరి-బీ గా విభజించి ప్రాధాన్యత క్రమంలో ఎంపికలు చేపట్టినట్లు చెప్పారు.

ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించే ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు రూ.7 కోట్ల నగదు బహుమతి ప్రకటించామని తెలిపారు. గతంలో ఉన్న రూ.70 లక్షల ప్రోత్సాహకాన్ని భారీగా పెంచడం ద్వారా క్రీడాకారుల్లో ఉత్సాహం నింపామని పేర్కొన్నారు. ఒలింపిక్స్ నుంచి రాష్ట్ర స్థాయి పోటీల వరకు మొత్తం 96 కేటగిరీలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.

డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులను నోటిఫై చేయగా, అందులో 421 పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద కేటాయించినట్లు తెలిపారు. 3,600 మంది అభ్యర్థులు 5,326 దరఖాస్తులు సమర్పించారని, చివరకు 382 పోస్టులే భర్తీ అయ్యాయని వెల్లడించారు. ఇంకా 39 పోస్టులు ఖాళీగా మిగిలిపోవడం ద్వారా ఎంపికలు కేవలం అర్హతల ఆధారంగానే జరిగాయని స్పష్టం చేశారు.

ధ్రువపత్రాల పరిశీలనను కూడా అత్యంత జాగ్రత్తగా నిర్వహించినట్లు తెలిపారు. శాప్ ఆధ్వర్యంలో ఆరు స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేసి అభ్యర్థులు సమర్పించిన క్రీడా ధ్రువపత్రాలను పరిశీలించామని చెప్పారు. అనంతరం విజయవాడలో ఒరిజినల్ సర్టిఫికెట్లను భౌతికంగా తనిఖీ చేశామని వివరించారు. సంబంధిత క్రీడా సంఘాలు, ఫెడరేషన్లు, యూనివర్సిటీల నుంచి ధ్రువీకరణ పొందిన తరువాతే తాత్కాలిక ప్రాధాన్యత జాబితాను విడుదల చేశామని తెలిపారు.

తాత్కాలిక జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిశీలించిన తరువాతే తుది జాబితాను సిద్ధం చేశామని చెప్పారు. రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదంతో ఆ జాబితాను విద్యాశాఖకు పంపినట్లు వెల్లడించారు. స్థానికత, రోస్టర్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం తుది ఎంపికలు జరిగినట్లు తెలిపారు.

క్రీడా ధ్రువపత్రాలను ప్రభుత్వం జారీ చేయదని, సంబంధిత క్రీడా సంఘాలు, ఫెడరేషన్లు, యూనివర్సిటీలే జారీ చేస్తాయని అజయ్ జైన్ స్పష్టం చేశారు. అయితే వాటి నిజానిజాలను బహుస్థాయి పరిశీలన ద్వారా నిర్ధారించామని పేర్కొన్నారు. రికార్డులు లేవని తెలిపిన ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు.

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై హైకోర్టులో 69 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇప్పటికే విచారణ పూర్తైన మూడు కేసుల్లో ప్రభుత్వ విధానం సరైనదేనని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. మిగిలిన కేసులపై కోర్టు ఇచ్చే ఆదేశాలను ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు.

తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు తేలితే సంబంధిత అభ్యర్థులతో పాటు ఆ ధ్రువపత్రాలు జారీ చేసిన సంఘాలు, ఫెడరేషన్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే ఆ సంఘాల గుర్తింపును కూడా రద్దు చేస్తామని తెలిపారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆడియోలు బయటకు రావడంతో వెంటనే స్పందించి 2025 జూలై 28న పల్లెకోన పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేసినట్లు వెల్లడించారు. బొంత రోశయ్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేశామని, అతను శాప్ ఉద్యోగి కాదని స్పష్టం చేశారు.

అభ్యర్థులు మధ్యవర్తులను నమ్మవద్దని, ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మొత్తంగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికలను పూర్తి పారదర్శకతతో, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్వహించామని అజయ్ జైన్ మరోసారి స్పష్టం చేశారు.

Spotlight

Read More →