కొత్త గనుల నిబంధనలతో ఏపీలో 402 లీజు దరఖాస్తులు నిలిచిపోయినట్లు సీఎం వెల్లడి..
లాటరైట్ను బాక్సైట్గా వర్గీకరించడంపై ఏపీ ఆందోళన..
లాటరైట్ ఖనిజ వర్గీకరణలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్లో గనుల లీజుల ప్రక్రియ తీవ్రంగా ప్రభావితమవుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి సీఎం లేఖ రాశారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం లాటరైట్లో అల్యూమినియం శాతం 20 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే, దాన్ని ఉప ఖనిజం (మైనర్ మినరల్)గా కాకుండా బాక్సైట్గా పరిగణించాలనే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఇప్పటికే ప్రాసెస్లో ఉన్న అనేక గనుల లీజు దరఖాస్తులు నిలిచిపోయాయని సీఎం తన లేఖలో వివరించారు.
కొత్త నిబంధనల కారణంగా గతంలో మైనర్ మినరల్ కింద పరిశీలించిన మొత్తం 402 గనుల లీజు దరఖాస్తులను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వీటిలో 19 లెటర్ ఆఫ్ ఇంటెంట్ దరఖాస్తులు, 113 ప్రభుత్వ భూములకు సంబంధించినవి, 255 అటవీ భూముల దరఖాస్తులు, 15 పట్టా భూముల దరఖాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.
పాత నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు అప్లికేషన్ ఫీజులు చెల్లించడమే కాకుండా, భూముల కొనుగోలు, అటవీ అనుమతుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సీఎం తెలిపారు. ఇప్పుడు అకస్మాత్తుగా నిబంధనలు మారడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు.
గతంలో మైకా, క్వార్ట్జ్, ఫెల్డ్స్పార్, బారైట్స్ వంటి ఖనిజాలను మైనర్ నుంచి మేజర్ ఖనిజాలుగా మార్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం “సేవింగ్ క్లాజ్” ఇచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. అదే విధంగా ఇప్పుడు లాటరైట్ విషయంలో కూడా సేవింగ్ క్లాజ్ అమలు చేసి, పెండింగ్లో ఉన్న 402 దరఖాస్తులను పాత నిబంధనల ప్రకారమే పూర్తి చేసుకునేందుకు రెండు సంవత్సరాల గడువు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
ఇలా సడలింపు ఇస్తే వందలాది మంది దరఖాస్తుదారులు ఆర్థిక నష్టాల నుంచి బయటపడతారని, అనవసర కోర్టు వివాదాలు కూడా తలెత్తవని సీఎం లేఖలో వివరించారు. అదేవిధంగా సిమెంట్, ఐరన్ ఓర్, రోడ్డు నిర్మాణ రంగాలకు అవసరమైన ముడిసరుకు సరఫరా కొనసాగి, ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతినకుండా ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల దృష్ట్యా కేంద్రం సానుకూలంగా స్పందించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.