సీఎం చంద్రబాబు రేపు అధికారిక పర్యటన కోసం ఢిల్లీ పయనం..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమావేశం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అధికారిక పర్యటన కోసం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహకారం, కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించేందుకు ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ముఖ్యమంత్రి ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఉదయం 11:30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీ ఆర్ పాటిల్ తో చర్చలు జరపనున్నారు.
ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, కేంద్ర నిధుల విడుదల, అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం వంటి విషయాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలవనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
సాయంత్రం 4 గంటలకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రి నిర్వహించే బిజినెస్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. తాజ్ ప్యాలెస్ లో జరిగే ఈ సమావేశంలో పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రతినిధులతో ఆయన చర్చలు జరపనున్నారు.
అలాగే నీతి ఆయోగ్ సభ్యులతో కూడా ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ ఎస్ మహేంద్ర దేవ్ తో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, పెట్టుబడుల అవకాశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సమన్వయం పెంచుతూ, పెట్టుబడులను ఆకర్షించే దిశగా సీఎం చంద్రబాబు పర్యటన కీలకంగా మారనుందని రాజకీయ, ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి.