Vetlapalem Fire Accident: వేట్లపాలెంలో భారీ అగ్నిప్రమాదం.. హుటా హుటేనా సీఎం చంద్రబాబు సంఘటనా స్థలానికి! 8 మంది సజీవ దహనం!

Vetlapalem Fire Accident: తూర్పుగోదావరి జిల్లా వేట్లపాలెం గ్రామ సమీపంలో శనివారం మధ్యాహ్నం పెను విషాదం చోటుచేసుకుంది.ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Published : 2026-02-28 17:11:00

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 21 మంది కార్మికులు దుర్మరణం…

సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి: వేట్లపాలెం ప్రమాదస్థలికి నేరుగా హెలికాప్టర్‌లో బయలుదేరిన ముఖ్యమంత్రి!

యజమాని అశ్రద్ధతో 21 కుటుంబాల్లో తీరని శోకం!

Vetlapalem Fire Accident: తూర్పుగోదావరి జిల్లా వేట్లపాలెం గ్రామ సమీపంలో శనివారం మధ్యాహ్నం పెను విషాదం చోటుచేసుకుంది. ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ధాటికి ఏకంగా 21 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. నిబంధనలకు విరుద్ధంగా, పరిమితికి మించి మందుగుండు సామాగ్రిని నిల్వ చేయడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. 
పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే.. మృతదేహాలు ఛిన్నాభిన్నమై పక్కనే ఉన్న పొలాల్లోకి ఎగిరిపడ్డాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పెదపూడి రోడ్డులోని పొలాల మధ్య అడబాల వీరబాబు అనే వ్యక్తి బాణాసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం ఆరు షెడ్లలో కార్మికులు టపాసులు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ధాటికి వేట్లపాలెం గ్రామంలోని పలు ఇళ్ల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 40 మందికి పైగా కార్మికులు అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ కొందరు కార్మికులు భోజనం కోసం బయటకు వెళ్లడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు. లేదంటే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఘటనాస్థలికి చేరుకున్న కలెక్టర్ షన్మోహన్, ఎస్పీ బిందుమాధవ్ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు 11 మంది మృతులను పోలీసులు గుర్తించారు. మృతుల్లో పరిశ్రమ యజమాని వీరబాబు తండ్రి అడబాల శ్రీను కూడా ఉన్నారు. మిగిలిన మృతులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గాయపడిన 15 మందిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, వారిలో 9 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమ యజమాని వీరబాబు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ పరిశ్రమకు మార్చి 31 వరకు లైసెన్స్ ఉందని అధికారులు ధృవీకరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరం నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా ప్రమాదస్థలికి చేరుకోనున్నారు. ఘటనాస్థలాన్ని స్వయంగా పరిశీలించిన అనంతరం, బాధితుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఈ విషాద ఘటనపై సీఎం చంద్రబాబు  అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు.

మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, కార్మికుల మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని ఆయన తెలిపారు. బాణాసంచా కేంద్రాల్లో భద్రతా ప్రమాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు.

Spotlight

Read More →