Milk Fat Increase Tips : నేటి కాలంలో పాడి పరిశ్రమ కేవలం జీవనాధారమే కాదు, ఒక లాభసాటి వ్యాపారంగా మారుతోంది. అయితే, చాలామంది పాడి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పాలల్లో వెన్న శాతం ఎస్ఎన్ఎఫ్ తగ్గిపోవడం. పాలు ఎన్ని లీటర్లు ఇచ్చినా, ఫ్యాట్ తక్కువగా ఉంటే కేంద్రాల్లో సరైన ధర లభించదు. దీంతో కష్టపడి పెంచిన పశువుల వల్ల ఆశించిన లాభాలు రాక రైతులు నిరాశ చెందుతుంటారు. అసలు పాల నాణ్యత ఎందుకు తగ్గుతుంది? వెటర్నరీ నిపుణులు సూచిస్తున్న ఆ 7 అద్భుత పరిష్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చాలామంది రైతులు పచ్చిగడ్డి పుష్కలంగా ఉంటే చాలని అనుకుంటారు. కానీ పాలలో వెన్న శాతం పెరగాలంటే పశువుల పొట్టలో 'పీచు పదార్థం' (Fiber) చాలా ముఖ్యం. ఇది కేవలం ఎండుగడ్డి ద్వారానే లభిస్తుంది. ఆవులకు రోజుకు 8 కిలోలు, గేదెలకు 10 కిలోల ఎండుగడ్డిని విడతల వారీగా ఇవ్వాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి పాల నాణ్యతను పెంచుతుంది.
పశువులకు పెట్టే దాణాలో అన్ని రకాల పోషకాలు ఉండాలి. కేవలం తవుడు లేదా ఏదో ఒక రకమైన చెక్క ఇస్తే సరిపోదు. దాణాలో 30 శాతం ధాన్యాలు (మొక్కజొన్న లేదా జొన్నలు), 20 శాతం తవుడు, 20 శాతం ఆయిల్ కేక్, మిగిలిన 30 శాతం మినప పొట్టు ఉండేలా చూసుకోవాలి. అలాగే అధిక దిగుబడి ఇచ్చే పశువులకు రోజుకు 50 గ్రాముల మినరల్ మిక్చర్ (ఖనిజ లవణాల మిశ్రమం) తప్పనిసరిగా అందించాలి.
పశువుల శరీరంలో రక్తం బాగా ప్రసరించినప్పుడే పొదుగులో పాలు తయారవుతాయి. ఒక లీటరు పాలు రావాలంటే దాదాపు 400 లీటర్ల రక్తం పొదుగు ద్వారా ప్రవహించాలి. దీనికి తగినంత నీరు అవసరం. ఎండాకాలంలో పశువులకు కనీసం 150 లీటర్ల నీరు అందుబాటులో ఉంచాలి. నీరు తాగే పరిమాణం తగ్గితే ఆటోమేటిక్గా పాల గాఢత తగ్గిపోతుంది.
పశువుల జీర్ణ వ్యవస్థ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. రోజుకో సమయంలో దాణా వేయడం వల్ల వాటి జీర్ణక్రియ దెబ్బతింటుంది. ప్రతిరోజూ నిర్ణీత సమయానికే మేత, దాణా అందించాలి. ఈ క్రమశిక్షణ వల్ల పశువుల శరీరం పోషకాలను గ్రహించే శక్తి పెరుగుతుంది. పాలు పితికే ముందు దాణా ఇచ్చే అలవాటు మనకు ఉంది. అయితే, దాణా తిన్న వెంటనే ఎండుగడ్డి వేయడం వల్ల అది రూమెన్ లో బాగా కలిసిపోతుంది. ఇది 'యాసిడ్ ఇండైజేషన్' వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. దీనివల్ల పాలలో వెన్న శాతం స్థిరంగా ఉంటుంది.
పశువు ఎంత ఎక్కువ సేపు నెమరు వేస్తే అంత మంచిది. రోజుకు కనీసం 6 నుండి 8 గంటల పాటు పశువు ప్రశాంతంగా కూర్చుని నెమరు వేసేలా వాతావరణం ఉండాలి. నెమరు వేసేటప్పుడు ఉత్పత్తి అయ్యే లాలాజలం జీర్ణక్రియకు సహాయపడి, పాలలో ఫ్యాట్ పెరగడానికి తోడ్పడుతుంది.
పాల దిగుబడి పెరుగుతుందని కొందరు రైతులు మొక్కజొన్న లేదా బియ్యం వంటి ధాన్యాలను అధికంగా పెడుతుంటారు. కానీ ధాన్యాలు 30 శాతం కంటే ఎక్కువైతే పశువులకు అరుగుదల సమస్యలు వచ్చి, పాల నాణ్యత పడిపోతుంది. కాబట్టి మేతలో పీచు పదార్థానికి, ధాన్యానికి సరైన సమతుల్యత పాటించాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే పాలలో వెన్న శాతం పెరగడమే కాకుండా, పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. తద్వారా పాడి రైతులకు అధిక లాభాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు.