US Iran Deal: ప్రపంచ దేశాలను వణికించిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు త్వరలోనే ముగియనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇరాన్తో యుద్ధాన్ని ముగించే దిశగా జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ చారిత్రాత్మక శాంతి ఒప్పందం గనుక పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగితే, తాను ఖచ్చితంగా అక్కడికి వెళ్తానని ఆయన స్పష్టం చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయ్యింది.
వైట్ హౌస్ ఆవరణలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, చర్చల పురోగతిపై చాలా ధీమాగా కనిపించారు. ఇరాన్ దాదాపు అన్ని షరతులకు అంగీకరించిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా వివాదాస్పదంగా మారిన యురేనియం నిల్వలను అప్పగించేందుకు కూడా ఇరాన్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. "వారు నన్ను రమ్మని కోరుతున్నారు.. ఒకవేళ ఇస్లామాబాద్లో ఒప్పందం ఖరారైతే నేను తప్పకుండా వెళ్తాను అని ట్రంప్ పేర్కొన్నారు. గత ఏడాది జరిగిన వైమానిక దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న విషయం తెలిసిందే.
ఈ చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించడం విశేషం. అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన సంబంధాలను పునరుద్ధరించడానికి ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న ఈ ప్రయత్నాలు ఫలప్రదమవుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కూడా పది రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని, దీనివల్ల మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకడంతో, ఈ ఒప్పందం ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద ఊరటనివ్వనుంది.
శాంతి ప్రక్రియను పర్యవేక్షించేందుకు వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోలతో కూడిన ప్రత్యేక బృందాన్ని ట్రంప్ నియమించారు. ఇరాన్ తన అణు కార్యక్రమాలను పూర్తిగా పక్కన పెట్టాలని అమెరికా గట్టిగా పట్టుబడుతోంది. ప్రస్తుతానికి తాత్కాలిక కాల్పుల విరమణ గడువు వచ్చే వారంతో ముగియనుంది. ఈ లోపే శాశ్వత పరిష్కారం లభిస్తే, ఆ గడువును పెంచాల్సిన అవసరం ఉండదని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ విశ్లేషకులు ఈ పర్యటనపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పాకిస్థాన్లో అడుగుపెడితే, అది దక్షిణాసియా రాజకీయాల్లో కొత్త మలుపు కానుంది. అటు ఇరాన్ విదేశాంగ శాఖ కూడా పాకిస్థాన్ సహకారాన్ని అభినందిస్తూ సానుకూల ప్రకటనలు చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ భారీ డీల్కు సంబంధించి పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది.