- నిరుపేదల ఆరోగ్యానికి 'ముఖ్యమంత్రి సహాయనిధి' ఒక సంజీవనిగా అభివర్ణించిన మంత్రి దుర్గేష్..
- Politics: కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు కట్టుబడి ఉందని ప్రకటన..
Peravali Minister Kandula Durgesh: నిరుపేదల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం తీపర్రులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 108 మంది లబ్ధిదారులకు రూ. 54,45,187 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మరియు ఎల్ వోసీ పత్రాలను ఆయన స్వయంగా పంపిణీ చేశారు.
సేవా యజ్ఞంలో మైలురాయి
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఎవరైతే అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు పడుతున్నారో వారికి బాసటగా నిలుస్తున్నామని ఈ క్రమంలో గత 21 నెలల కాలంలో నిడదవోలు నియోజకవర్గంలో మొత్తం 781 మందికి రూ. 5,66,65,438 ఆర్థిక లబ్ధి చేకూర్చామని, సేవా పథంలో ఇదొక రికార్డు అని పేర్కొన్నారు. నేడు పంపిణీ చేసిన వాటిలో 105 మందికి రూ.47,41,478 విలువైన చెక్కులు, ముగ్గురికి రూ.7,03,709 విలువైన ఎల్ వోసీ పత్రాలు ఉన్నాయని వివరించారు. ప్రతి 15 రోజులకోసారి లబ్ధిదారులకు చెక్కులు అందిస్తున్నామని, ఇదొక నిరంతర ప్రక్రియ అని తెలిపారు.
వెలగపూడి సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ టీమ్ పనితీరును ఆయన అభినందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో దిగ్విజయంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు తమ చల్లని మనసుతో, దీవెనలతో ఆశీర్వదించాలని మంత్రి దుర్గేష్ కోరారు. ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వాములై, సమాజ పునర్నిర్మాణానికి సహకరించాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నాగరాజుకు మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పొందిన లబ్ధిదారులు మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయి వైద్యం నిరుపేదలకు అందేలా చొరవ చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి కందుల దుర్గేష్లకు లబ్ధిదారులు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి దుర్గేష్ అందించిన చెక్కులతో తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని వెల్లడించారు.
విజయవంతంగా సూపర్ సిక్స్ అమలు:
'తల్లికి వందనం', 'అన్నదాత సుఖీభవ', 'స్త్రీశక్తి', ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల వంటి హామీలను కూటమి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ట్రాన్స్ జెండర్లకు, దివ్యాంగ శక్తి ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని, దివ్యాంగుల సహాయకులకు టికెట్ ధరలో 50 శాతం రాయితీ ఇస్తున్నామని గుర్తుచేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే తమ లక్ష్యమన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నాగరాజు, కూటమి నాయకులు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.