శీతాకాలం తాకిడి మొదలైన వెంటనే పులికాట్ సరస్సు మరోసారి పక్షుల గానాలతో నీటి తళుకులతో సజీవంగా మారింది. ఆకాశాన్నంటిన దూరాలనుంచి వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి చేరిన ఫ్లెమింగోలు, సైబీరియన్ పక్షులు ఇప్పుడు పులికాట్ తీరంలో తమ ఆహ్లాదభరిత నృత్యం మొదలుపెట్టాయి. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా పక్షి ప్రేమికులకు ఇది కన్నుల విందుగా మారుతోంది.
అక్టోబర్ మొదటి వారం నుంచే ఈ విదేశీ అతిథుల రాక ప్రారంభమైంది. చల్లని గాలులు వీచే ఈ కాలంలో పులికాట్ సరస్సు వీటికి ఆహారానికి, విశ్రాంతికి అనుకూలమైన ఆశ్రయం. వచ్చే ఆరు నెలలపాటు ఈ ప్రాంతం వాటి నివాసంగా మారుతుంది. ప్రతి ఏడాది ఫ్లెమింగోల రాకను పురస్కరించుకుని నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ ఇప్పుడు పర్యాటక క్యాలెండర్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకకు రాష్ట్రం నలుమూలల నుంచి ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది సందర్శకులు వస్తారు. రంగురంగుల ఫ్లెమింగోలతో సరస్సు నిండిపోవడం, ఆ దృశ్యాలను కెమెరాలో బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు, పక్షి ప్రేమికులు తరలి రావడం ఇవన్నీ పులికాట్కి వాతావరణ ఉత్సాహం నింపుతున్నాయి.
మనమందరం రాజహంసలుగా పిలుచుకునే ఈ ఫ్లెమింగోలు నిజానికి జీవ వైవిధ్యానికి ప్రతీకలు. అవి పర్యావరణ సమతుల్యానికి కీలకం. నదీ తీరాలు, సరస్సులు, మడుగులలో పెరుగుతున్న చిన్న జంతువులు, శైవలాలను తింటూ ప్రకృతిలో సమతుల్యతను కాపాడుతాయి. గత కొన్నేళ్లుగా పులికాట్లో వాతావరణం, ఆహార పరిస్థితులు మెరుగుపడటంతో ఫ్లెమింగోలు సంవత్సరం పొడవునా కనిపించడం మొదలైంది.
అటవీ శాఖ అధికారుల ప్రకారం, పక్షులకు భద్రత కల్పించేందుకు గత కొన్ని నెలలుగా పలు చర్యలు చేపట్టారు. సరస్సు పరిసరాల్లో అనధికార మత్స్యకారాన్ని నియంత్రించడం చెరువుల నీటి మట్టం నిల్వ చేయడం, ఆహార శ్రేణి కాపాడే ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. తుపానులు, వర్షాలు వచ్చినా పక్షుల స్థావరాలకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వం పులికాట్ను ఎకో టూరిజం గమ్యస్థానంగా అభివృద్ధి చేసే ప్రణాళికను అమలు చేస్తోంది. బర్డ్ వాచ్ టవర్లు, వీక్షణా కేంద్రాలు, ఫోటోగ్రఫీ పాయింట్లు, పర్యావరణ క్లబ్లు వంటి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రయత్నాలు పర్యాటకులను ఆకర్షించడమే కాదు, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి.
పులికాట్ సరస్సు పర్యావరణపరంగా అపారమైన విలువ కలిగిన ప్రదేశం. ఇక్కడ పక్షుల రక్షణతో పాటు, ఎకో టూరిజం ద్వారా స్థిరమైన అభివృద్ధిని సాధించడం మా లక్ష్యం అని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు స్థానిక ప్రజల సహకారం కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. పక్షుల స్థావరాల వద్ద చెత్త వేయకూడదని, పెద్ద శబ్దాలు చేయకూడదని, వాహనాల రాకపోకలను నియంత్రించాలని అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పులికాట్ సరస్సును దేశంలోనే ప్రధాన ఎకో టూరిజం సర్క్యూట్లో చేర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. 
పులికాట్ సరస్సు ప్రస్తుతం ప్రకృతి ప్రేమికులకూ పర్యాటకులకూ ఒక కొత్త గమ్యస్థానంగా మారుతోంది. ఫ్లెమింగోల రాకతో పులికాట్ అందం మరింత పెరిగింది. ప్రభుత్వ చర్యలతో త్వరలోనే ఇది భారతదేశపు అగ్ర ఎకో టూరిజం కేంద్రాలలో ఒకటిగా నిలవనుంది
Pulicat Lake: ఫ్లెమింగో రాకతో మెరిసిన ప్రకృతి అందాలు... పులికాట్ను ఎకో టూరిజం గమ్యస్థానంగా మలుస్తున్న ప్రభుత్వం!