ఫ్యాక్టరీ అద్దెకు తీసుకుని డ్రగ్స్ తయారీ.. ఇద్దరు నిందితుల అరెస్ట్…
ఇండస్ట్రియల్ మెషీన్లతో డ్రగ్స్ ఉత్పత్తి…
2,860 లీటర్ల కెమికల్స్, 800 కిలోల ముడి సరుకు…
Drug Racket: ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా (IDA)లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టును నార్కోటిక్ ఇంటెలిజెన్స్ మరియు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు రట్టు చేశారు. కొండపల్లిలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో గుట్టుచప్పుడు కాకుండా మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున 'అల్రాజోలం' అనే మత్తు మందు నిల్వలను చూసి అధికారులు విస్తుపోయారు. నిబంధనలకు విరుద్ధంగా మత్తు పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న సదరు కంపెనీని అధికారులు వెంటనే సీజ్ చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ దాడుల్లో సుమారు 200 కిలోల అల్రాజోలం డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ దాదాపు రూ. 47 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం తయారైన మత్తు పదార్థాలే కాకుండా, వీటి తయారీకి ఉపయోగించే 800 కిలోల ముడి పదార్థాలను మరియు 2,860 లీటర్ల ప్రమాదకర రసాయనాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీలో ఉన్న రియాక్టర్లు, డ్రైయర్లు, సెంట్రిఫ్యూజ్ వంటి భారీ ఇండస్ట్రియల్ యంత్రాలను డ్రగ్స్ తయారీకి వాడుతున్నట్లు గుర్తించారు.
ఈ డ్రగ్స్ రాకెట్కు సంబంధించి అధికారులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో ఈ ముఠాకు మాస్టర్మైండ్గా సుమారు 20 ఏళ్ల అనుభవం ఉన్న ఒక సీనియర్ కెమిస్ట్ వ్యవహరిస్తున్నట్లు తేలింది. సాధారణంగా రసాయనాల తయారీకి ఉపయోగించే ఫ్యాక్టరీని అద్దెకు తీసుకుని, దాని ముసుగులో ఈ అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడికి ఉన్న రసాయన శాస్త్ర పరిజ్ఞానాన్ని మత్తు పదార్థాల తయారీకి ఉపయోగించి, పెద్ద ఎత్తున సొమ్ము చేసుకునేందుకు ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
కొండపల్లి వంటి పారిశ్రామిక ప్రాంతంలో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ తయారీ కేంద్రం బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. కెమికల్ ఫ్యాక్టరీల ముసుగులో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు సాగకుండా నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని ఈ ఘటన నిరూపించింది. ఈ డ్రగ్స్ రాకెట్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఈ మత్తు పదార్థాలను ఎక్కడికి సరఫరా చేస్తున్నారు? అనే కోణంలో పోలీసులు మరియు నార్కోటిక్ అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు. పక్కా ప్రణాళికతో సాగుతున్న ఈ దందా వెనుక ఉన్న నెట్వర్క్ను ఛేదించేందుకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.