మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని అనేక తీరప్రాంతాలు దెబ్బతిన్నాయి. ప్రజల జీవన విధానం పూర్తిగా స్తంభించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో విస్తృత సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు, మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఒక లీటర్ నూనె, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, చక్కెర అందించనుంది. మత్స్యకారుల కుటుంబాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వారికి ప్రత్యేకంగా 50 కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు.
పౌరసరఫరాల శాఖకు బియ్యం, కందిపప్పు, నూనె, చక్కెర సరఫరాను వెంటనే ప్రారంభించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. మార్కెటింగ్ కమిషనర్ను ఉల్లిపాయలు, బంగాళాదుంపలు సకాలంలో పంపిణీ చేయాలని సూచించారు. తుఫాన్ కారణంగా అనేక ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ దెబ్బతిన్న నేపథ్యంలో సరుకులు ప్రజల దరి చేరేలా ప్రత్యేక వాహనాల ద్వారా పంపిణీ చేపడుతున్నారు.
అదేవిధంగా ప్రభుత్వం తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం కూడా ప్రకటించింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన ప్రతి ఒక్కరికీ రూ.1000 నగదు సహాయం అందజేయనుంది. ఒక కుటుంబంలో ముగ్గురికంటే ఎక్కువ మంది ఉంటే గరిష్ఠంగా రూ.3000 ఇవ్వనున్నారు. ఈ నగదు సాయం పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే ముందు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ చర్యతో బాధిత కుటుంబాలకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదిలా ఉండగా, సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అమరావతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన ఆయన, తుఫాన్ ప్రభావిత తీర ప్రాంతాలను గాలిలో నుంచి పరిశీలిస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే అమలాపురంలో దిగి స్థానిక అధికారులతో నేరుగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
ప్రాథమిక అంచనాల ప్రకారం వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా కొబ్బరి, వరి, బత్తాయి తోటలు గాలులు, వర్షాలతో తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు. దీనిపై ఉదయం ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సీఎం సమీక్ష కూడా నిర్వహించారు. ప్రభుత్వం ప్రస్తుతం రక్షణ, పునరావాసం, ఆహార సరఫరా, విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాలను సమాంతరంగా కొనసాగిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది, వలంటీర్లు కలసి సమన్వయంతో పని చేస్తున్నారు.
ప్రజల భద్రతే ప్రాధాన్యం – ఎవ్వరూ ఇబ్బంది పడకూడదని సీఎం స్పష్టం చేశారు.
తుఫాన్ తర్వాత కూడా ప్రభుత్వ చర్యలు కొనసాగుతాయని, అవసరమైతే మరిన్ని సాయం పథకాలు అమలు చేస్తామని ఆయన తెలిపారు. ప్రజల పక్కన ప్రభుత్వం ఉంది, సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతాయి," అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.