దీపావళి... చీకటిని తొలగించి వెలుగును నింపే పండుగ దేశం నలుమూలలా దీపాల కాంతులు పటాసుల శబ్దాలు, మిఠాయిల సువాసనలు పండుగ వాతావరణాన్ని మరింత అందంగా మార్చేస్తాయి. ప్రతి రాష్ట్రం తమతమ ప్రత్యేకతతో దీపావళిని జరుపుకుంటుంది. కానీ కర్ణాటకలోని చిన్న గ్రామం గుమతాపుర మాత్రం ఈ పండుగను ప్రపంచంలో ఎక్కడా కనిపించని రీతిలో జరుపుకుంటుంది.
అక్కడ దీపాల వెలుగులు కాదుఆవు పేడల వర్షంనే పండుగకు ప్రధాన ఆకర్షణ దీపావళి తర్వాతి రోజు జరిగే ఈ ప్రత్యేక వేడుక పేరు గోరెహబ్బ ఈ సంప్రదాయం దశాబ్దాలుగా కాకుండా శతాబ్దాలుగా కొనసాగుతోంది. గ్రామం మొత్తం ఉత్సాహంతో కదిలిపోతుంది. ప్రజలు ఆవు పేడను సేకరించి, దేవాలయంలో పూజలు చేసి, తరువాత ఒకరిపై ఒకరు విసురుకుంటూ నవ్వులు పూయిస్తారు.
ఆవు పేడ ఎందుకు అంత పవిత్రం?
స్థానికుల నమ్మకం ప్రకారం ఆవు పేడలో శుద్ధి చేసే గుణాలు ఔషధ విలువలు ఉంటాయి. ఇది శరీరానికి శుభం, మనసుకు శాంతి కలిగిస్తుందని విశ్వసిస్తారు. ఆవు పేడను రాయడం ద్వారా దుష్టశక్తులు దూరమవుతాయని, ఆరోగ్యం మెరుగుపడుతుందని వారి నమ్మకం.
పండుగ ప్రక్రియ ఇలా ఉంటుంది

ఉదయం నుంచే గ్రామస్తులు తమ పశువుల వద్ద నుండి తాజా ఆవు పేడను సేకరిస్తారు. మందుగుండు సామగ్రి అని పిలుస్తూ ట్రాక్టర్లలో ఆలయానికి తీసుకువెళ్తారు. అక్కడ పూజారి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆ పేడను బహిరంగ ప్రదేశంలో పోసి, అందరూ ఒకరిపై ఒకరు విసురుతూ పండుగ ఆనందాన్ని పంచుకుంటారు.
పురాణ విశ్వాసాల ప్రకారం ఈ గోరెహబ్బ వెనుక రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకటి గ్రామ దేవత బీరేశ్వర స్వామి ఆవు పేడ నుంచే అవతరించారని ప్రజల విశ్వాసం. రెండవది ఒకసారి గ్రామంలోని ఆవు పేడ కుప్పలో శివలింగం దర్శనమిచ్చిందట. ఆ దివ్య సంఘటనను గుర్తుగా ప్రతి సంవత్సరం ఈ పండుగను జరపడం ప్రారంభించారని చెబుతారు.
గోరెహబ్బ పండుగ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొందరికి ఇది వింతగా అనిపించినా, స్థానికులకు ఇది ఆరోగ్యం, అదృష్టం, శుభఫలితాల సంకేతం భావిస్తారు.