Air Travel New Rules 2026: విమానాల్లో ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో సీట్ల ఎంపిక పేరుతో విమానయాన సంస్థలు వసూలు చేస్తున్న అదనపు ఛార్జీలకు చెక్ పెడుతూ పౌర విమానయాన శాఖ బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. మధ్యతరగతి ప్రయాణికులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
సాధారణంగా విమానాల్లో కిటికీ పక్కన సీటు లేదా ముందు వరుసలో ఉండే సీట్ల కోసం ఎయిర్ లైన్స్ సంస్థలు భారీగా వసూలు చేస్తున్నాయి. కేవలం విమానం వెనుక భాగంలో లేదా మధ్యలో ఉండే కొన్ని సీట్లను మాత్రమే ఉచితంగా కేటాయిస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు తమకు నచ్చిన చోట కూర్చోవాలంటే టికెట్ ధర కంటే అదనంగా వందల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఈ 'సీట్ల దోపిడీ'పై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే స్పందించిన కేంద్రం, సామాన్యులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది.
సీట్ల కేటాయింపుతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రయాణించే వారి కోసం కేంద్రం మరో వెసులుబాటు కల్పించింది. ఒకే పీఎన్ఆర్ (PNR) నంబర్పై టికెట్లు బుక్ చేసుకున్న వారు విడివిడిగా కాకుండా, ఒకే చోట కూర్చునేలా ప్రాధాన్యత ఇవ్వాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. దీనివల్ల చిన్న పిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులకు, వృద్ధులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. సీట్ల కోసం అదనపు డబ్బులు కట్టలేక దూరంగా కూర్చోవాల్సిన అవసరం ఇకపై ఉండదు.
ప్రయాణికుల లగేజీ విషయంలోనూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను ఇచ్చింది. ముఖ్యంగా క్రీడాకారులు వాడే సామాగ్రి సంగీత కళాకారుల వాయిద్య పరికరాలు దెబ్బతినకుండా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తరలించాలని సూచించింది. అలాగే విమానాల్లో పెంపుడు జంతువులను తీసుకువెళ్లే విషయంలో స్పష్టమైన పాలసీని రూపొందించాలని, ఆ వివరాలను ప్రయాణికులకు సులభంగా అర్థమయ్యేలా వివరించాలని ఎయిర్ లైన్స్ సంస్థలకు సూచించింది. ఇది ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనుంది.
విమానాలు ఆలస్యమైనా లేదా రద్దయినా ప్రయాణికులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పారదర్శకతను పెంచాలని కేంద్రం ఆదేశించింది. ప్రయాణికుల హక్కుల గురించి విమానాశ్రయ కౌంటర్లు, వెబ్సైట్లు యాప్లలో స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొంది. ముఖ్యంగా ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని అందించడం ద్వారా సామాన్య ప్రయాణికులకు తమ హక్కుల పట్ల అవగాహన పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు సమాచారం.