T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై అద్భుత విజయం సాధించి టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ పోరులో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ వేటలో మరో అడుగు ముందుకు వేసింది. అయితే ఈ మ్యాచ్లో భారత్ గెలుపుతో పాటు సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన వీడియో ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన కుమారుడు అగస్త్యతో పంచుకున్న క్షణాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విఐపి స్టాండ్స్లో ఉన్న అగస్త్య తన తండ్రిని చూసి ఎంతో ఉత్సాహంగా కేకలు వేశాడు. ఆ సమయంలో అగస్త్య పక్కనే లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ కూడా ఉండటం విశేషం. హార్దిక్ పాండ్యాను చూసి ధోనీ చిరునవ్వుతో అభినందనం చేయగా, అగస్త్య కూడా తన తండ్రికి బై-బై చెబుతూ ఆనందంగా గెంతులు వేశాడు.నటాషా స్టాంకోవిక్ కూడా వీరి పక్కనే ఉంది. ధోనీ స్వయంగా అగస్త్యను ప్రోత్సహిస్తూ హార్దిక్ వైపు చూపించడం స్టేడియంలో ఉన్న అభిమానులను ఫిదా చేసింది.
ఈ కీలక మ్యాచ్లో హార్దిక్ పాండ్యా తన విలువను మరోసారి నిరూపించుకున్నాడు. కేవలం 12 బంతుల్లోనే 27 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అంతేకాకుండా బౌలింగ్లోనూ కీలకమైన సమయంలో ఫిల్ సాల్ట్, సామ్ కర్రన్ వికెట్లను తీసి ఇంగ్లాండ్ ఓడించారు. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించింది. సంజూ శామ్సన్ కేవలం 42 బంతుల్లో 89 పరుగులతో విరుచుకుపడగా, శివమ్ దూబే (43), ఇషాన్ కిషన్ (39) మెరుపులు మెరిపించారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఒకానొక దశలో ఓడిపోయేలా కనిపించినా, జాకబ్ బెథెల్ (105) వీరోచిత సెంచరీతో భారత్ను భయపెట్టాడు. చివరి వరకు పోరాడినప్పటికీ ఇంగ్లాండ్ 246 పరుగుల వద్దే ఆగిపోయింది. భారత బౌలర్లలో బుమ్రా, అక్షర్ పటేల్ బౌలింగ్ చేయగా, హార్దిక్ రెండు వికెట్లు పడగొట్టాడు. మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్లో భారత్, న్యూజిలాండ్తో తలపడనుంది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత్ కప్పు గెలవాలని కోట్లాది మంది అభిమానులు ప్రార్థిస్తున్నారు.