కాంగ్రెస్ పార్టీని, వారి మిత్రపక్షాలను మహిళలు క్షమించరు..
బిల్లును అడ్డుకుని మహిళలకు తీరని అన్యాయం చేశారు..
ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రంగా చేసుకుని దేశ రాజకీయాల్లో మళ్లీ వేడి రాజుకుంది. ఢిల్లీలో నిర్వహించిన కూటమి నేతల మీడియా సమావేశంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కాంగ్రెస్ పార్టీతో పాటు వారి మిత్రపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
మహిళలకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకువచ్చిందని, 2023లోనే “నారీశక్తి వందన్ అధినియం”ను ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. అయితే కాంగ్రెస్, వారి మిత్రపక్షాలు ఈ బిల్లును అడ్డుకుని మహిళలకు తీరని అన్యాయం చేశాయని మండిపడ్డారు. “మహిళలు దశాబ్దాలుగా హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు తమ సత్తా చాటుకునే అవకాశాన్ని కాంగ్రెస్ కుదించేసింది. దీనికి మహిళలు ఎప్పటికీ క్షమించరు” అని వ్యాఖ్యానించారు.
మహిళా బిల్లుపై రెండు రోజుల పాటు అన్ని పార్టీల నేతలు చర్చించినప్పటికీ, విపక్షాల వైఖరి మహిళల పట్ల ఎంత వ్యతిరేకంగా ఉందో స్పష్టమైందని అన్నారు. బిల్లును అమలు కాకుండా చేయడానికి రాజకీయ కుట్రలు పన్నారని ఆరోపించారు. “మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆసక్తి కాంగ్రెస్కు లేదు. బిల్లును అడ్డుకునేందుకు అనేక మెలికలు పెట్టారు. సవరణలు చేసి తెస్తామని అమిత్ షా చెప్పినా వినలేదు” అని తెలిపారు.
డీలిమిటేషన్ అంశంపైనా ఆయన స్పష్టత ఇచ్చారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ, ప్రాంతానికీ లేదా పార్టీకి అన్యాయం జరగదని, ప్రతిచోటా సీట్లు సుమారు 50 శాతం వరకు పెరుగుతాయని చెప్పారు. “మహిళలకే కాకుండా ఎస్సీ, ఎస్టీలకు కూడా అదనపు అవకాశాలు లభిస్తాయి. గతంలో నాలుగుసార్లు డీలిమిటేషన్ జరిగింది. ఇప్పుడిది కొత్త విషయం కాదు” అని వివరించారు.
దేశ జనాభా 140 కోట్లకు చేరిన నేపథ్యంలో లోక్సభ సీట్లను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో 40 లక్షల మందికి పైగా జనాభా ఉన్న పరిస్థితి ఉందని, ఇది ప్రజాప్రతినిధిత్వాన్ని ప్రభావితం చేస్తోందని అన్నారు. “1971 జనగణన ప్రకారం అప్పట్లో 550 సీట్లు ఉండాలని నిర్ణయించారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. సీట్లు పెంచాలా వద్దా అన్నది స్పష్టంగా చెప్పాలి” అని విపక్షాలను ప్రశ్నించారు.
డీలిమిటేషన్ కమిషన్ సూచనల ప్రకారమే ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. “సాంకేతిక విషయాలు ప్రజలు అర్థం చేసుకోరని భావించి తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ మేము స్పష్టంగా, పారదర్శకంగా ముందుకెళ్తున్నాం” అని చెప్పారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించి సంబరాలు చేసుకోవడం కాంగ్రెస్ పార్టీకి తగదని విమర్శించారు. “మహిళల ఆశలు, ఆకాంక్షలను చిదిమేశారు. ఇది ఘోరమైన పాపం. మహిళలు ఏం చేస్తారులే అన్న భావన కాంగ్రెస్కు ఉంది. కానీ ప్రజలు దీనికి సమాధానం చెబుతారు” అని హెచ్చరించారు.
గతంలో కాంగ్రెస్ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టినా, లోక్సభలో ముందుకు తీసుకురాలేదని గుర్తుచేసిన ఆయన, “మీరు చేసినట్లుగా మోదీ ప్రభుత్వం డ్రామాలు ఆడదు. మహిళలకు న్యాయం చేయడమే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుండగా, మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ చుట్టూ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.