Government Sand Scheme: తెలంగాణ రాష్ట్రంలో ఇసుక విక్రయాలను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం 'మన ఇసుక వాహనం' అనే కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. సామాన్యులు ఇసుక కోసం పడే ఇబ్బందులను తొలగించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గతంలో ఇసుక కావాలంటే మధ్యవర్తుల చుట్టూ తిరగాల్సి వచ్చేది, దీనివల్ల రేట్లు పెరిగి వినియోగదారులపై భారీగా భారం పడేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా, పారదర్శకతను పెంచుతూ ఆన్లైన్ ద్వారా నేరుగా బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
సిద్దిపేట జిల్లాలో ఈ సరికొత్త విధానాన్ని పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలు ఎవరూ కూడా ఇసుక కోసం బ్రోకర్లను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వ అధికారిక పోర్టల్ ద్వారా ఎవరైనా సులభంగా తమకు కావాల్సిన ఇసుకను ఆర్డర్ చేసుకోవచ్చు. దీనివల్ల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటమే కాకుండా, నిర్ణీత ధరలకే ఇసుక లభిస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆన్లైన్ ప్రక్రియ చాలా సరళంగా ఉంటుంది.దరఖాస్తుదారులు ముందుగా ప్రభుత్వ వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత తమకు కావాల్సిన ఇసుక పరిమాణాన్ని బట్టి నిర్ణీత రుసుమును ఆన్లైన్లోనే చెల్లించాలి. మీరు దరఖాస్తు చేసిన వెంటనే, స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు తహసీల్దార్ ఆ అభ్యర్థనను పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని వారు ధృవీకరించిన తర్వాతే బుకింగ్ ఖరారవుతుంది.
కేవలం స్మార్ట్ఫోన్ ఉన్నవారే కాకుండా, టెక్నాలజీపై అవగాహన లేని సామాన్యుల కోసం కూడా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒకవేళ ఆన్లైన్ బుకింగ్ చేయడం తెలియకపోతే, నేరుగా మీ గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి కూడా ఇసుకను బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ విధానాన్ని కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి విజయవంతం చేశారు. దాని ఫలితాలను చూశాకే ఇప్పుడు రాష్ట్రమంతటా అమలు చేస్తున్నారు.
ఈ పథకం ద్వారా లభించే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలు ఉంటాయి కాబట్టి అదనపు డబ్బులు కట్టాల్సిన పని ఉండదు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలించాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అధికారులు అందరూ సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేరుగా ఇసుకను ఇంటి వద్దకే చేర్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.