- కనగానపల్లిలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం.. ప్రలోభాలకు లొంగి రికార్డులు తారుమారు…
- 35 సెంట్ల భూమి గల్లంతు.. రికార్డుల్లో వేరే వ్యక్తి పేరు…
Mangalagiri TDP Office: కర్నూలు జిల్లా కల్లూరు మండలం పుసులూరు గ్రామానికి చెందిన అయ్యస్వామి నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తన జేజినాయన అయ్యన్న గారు కొనుగోలు చేసిన 11 ఎకరాల 14 సెంట్ల పట్టా భూమిని తాము దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నాము. అయితే గత ప్రభుత్వంలోని కొంతమంది వైసీపీ నాయకుల అండదండలతో ఆముదాల చిన్న అయ్యస్వామి అనే వ్యక్తి అక్రమంగా ఒక ఎకరం 40 సెంట్ల భూమికి పాసుబుక్కులు పొంది మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఇటీవలి రీ-సర్వే అనంతరం సదరు వ్యక్తి 47 సెంట్ల భూమిని అక్రమంగా తన ఖాతాలో వేయించుకోవాలని చూస్తూ మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎస్. రాజశేఖర్ లకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించాడు.
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం రాంపురం గ్రామానికి చెందిన సుజాత గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..కనగానపల్లి పొలం పరిధిలోని సర్వే నంబర్ 65లో గల 1.98 ఎకరాల భూమి తమ పూర్వీకుల నుండి వస్తున్న స్థిరాస్తి కలదు. అయితే ఈ భూమికి సంబంధించి తమ కుటుంబంతో ఏమాత్రం సంబంధం లేని నీళ్లపాల గోపాల్ భార్య రమాదేవి అనే మహిళకు రెవెన్యూ అధికారులు అక్రమంగా పాస్ పుస్తకం జారీ చేసి ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ సమస్యపై సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే ఒక్కోసారి ఒక్కో విధంగా సమాధానం ఇస్తున్నారు. ఇప్పుడు రీ-సర్వే పేరుతో తనకు, రమాదేవికి 0.56 సెంట్లు జాయింట్ ఖాతాలో ఉందని చెబుతున్నారు. ఈ భూమికి సంబంధించిన అన్ని అసలు పత్రాలు మా వద్దే ఉన్నాయి. కానీ అధికారులు ప్రలోభాలకు లొంగి, ఉద్దేశపూర్వకంగా దీనిని 'జాయింట్ తగాదా' అని చెబుతూ కోర్టుకు వెళ్ళమని మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం వేములదీవి గ్రామానికి చెందిన గంగరాజు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. అగ్రికల్చర్ కంపెనీ లిమిటెడ్ నుండి సర్వే నంబర్లు 83/బి (0-03 సెంట్లు), 95/బి (0-32 1/2 సెంట్లు), 100/బి2 (0-13 1/2 సెంట్లు) వెరసి 0-49 సెంట్ల భూమిని కొనుగోలు చేశాను. 1999 నుండి ఈ భూమి తన పూర్తి స్వాధీనంలో ఉంది. వరి సాగు చేసుకుంటు జీవనం సాగిస్తున్నాను. అయితే 2022లో ప్రభుత్వం జారీ చేసిన పట్టాలలో కేవలం 13 1/2 సెంట్లు మాత్రమే తన పేరున నమోదు చేశారు. మిగిలిన 35 1/2 సెంట్ల భూమిని అప్పటి వీఆర్వో, తహశీల్దార్ కలిసి తన పేరు (ఒడుగు గంగరాజు)కు బదులుగా భూమితో ఏ సంబంధం లేని 'వడుగు గుడవల్ల రాజు' పేరుతో పబ్లికేషన్ లిస్టులో చేర్చారు. దీనిపై తాను అప్పుడే అభ్యంతరం తెలిపినప్పటికీ నేటికీ రికార్డులు సరిచేయలేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
ఏలూరు జిల్లా ద్వారాకతిరుమల మండలం కొమ్మర గ్రామానికి చెందిన కొల్లూరి నాగమణి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి అభ్యర్ధిస్తూ.. తనకి ముగ్గురు అన్నదమ్ములు డొక్కా బక్కయ్య, డొక్కా బురియ్య, డొక్కా నాగరాజు కలరు. తమ తండ్రి రెండు సంవత్సరాల క్రితం మరణించారు. తండ్రి పేరిట ఉన్న 5 ఎకరాల సాగు భూమిలో తనకు రావాల్సిన వాటాను ఇస్తామని పెద్ద మనుషుల సమక్షంలో అన్నదమ్ములు అంగీకరించారు. అయితే ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారు. తమ ఊరి వీఆర్వో గారికి డబ్బులు ఇచ్చి తన ఇద్దరు తమ్ములు దొంగతనంగా పాస్ బుక్కులు తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఎంఆర్ఓ గారు, ఈఆర్డీ గారు తమ అన్నదమ్ములను, తల్లిని పంచాయితీకి పిలిచినా వారు హాజరు కాలేదు. దీనిపై కలెక్టర్ గారు స్వయంగా తనకు ఫోన్ చేసి విచారించగా తనకు ఇంకా న్యాయం జరగలేదని వివరించాను. ప్రస్తుతం ఈ కేసు ద్వారకా తిరుమల ఎస్.ఐ గారి వద్ద పెండింగ్లో ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తన అన్నదమ్ములను విచారించి తనకు దక్కాల్సిన న్యాయబద్ధమైన భూమిని ఇప్పించాలని కోరారు.
చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం చెంగల్రాయ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. సర్వే నంబర్ 278/3 లో గల 1.22 ఎకరాల భూమిని 10-10-1987 నాడు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకం (నెం: 528) కూడా తన వద్ద ఉంది. అయితే ఆర్. కుప్పయ్య అనే వ్యక్తి ఈ భూమిలో 9 సెంట్ల మేర అక్రమంగా ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు. తన భూమిని ఆక్రమించిన వారిని ప్రశ్నిస్తే, 'నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో' అంటూ దురుసుగా సమాధానం ఇస్తున్నారు. ఈ విషయంలో స్థానిక రెవెన్యూ అధికారులను సంప్రదించి తన భూమికి హద్దులు నిర్ణయించమని కోరినా వారు ఏమాత్రం సహకరించడం లేదు. పట్టా భూమి ఉండి కూడా అక్రమార్కుల వల్ల నష్టపోతున్నాం. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఎర్రమరెడ్డిపాళెం గ్రామానికి చెందిన మాలతీ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో 0.09 సెంట్ల భూమికి సంబంధించి తన తల్లి పేరిట ప్రభుత్వం జారీ చేసిన Form-11 ఇనామ్ పత్రాలు ఉన్నాయి. ఆ భూమిని తన తల్లి తనకు వీలునామాగా రాసి ఇచ్చారు. ఈ భూమికి సంబంధించి పత్రాలను ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారు పరిశీలించి భూమి రికార్డుల్లో సరిగానే ఉందని ధృవీకరించారు. అయితే పక్కనే ఉన్న భరత్ అనే వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి తన భూమిని ఆక్రమించడమే కాకుండా, ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ స్థలంలో నివసించేందుకు మెటీరియల్ తెచ్చుకోగా ఆ వ్యక్తి అడ్డుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన శ్యాంబాబు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తన తండ్రి గారైన పసలపూడి సోమరాజు గారు సంపాదించిన 0.72 సెంట్ల భూమిలో తన వాటాగా రావాల్సిన 32 సెంట్ల భూమిని తన సోదరుడు పసలపూడి ఉదయకుమార్ అడ్డుకుంటున్నారు. తనకు సంతానం లేరనే సాకుతో నన్ను మానసికంగా శారీరకగా హింసిస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తన తండ్రి ద్వారా తనకు సంక్రమించాల్సిన ఆస్తిని దౌర్జన్యంగా ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
కడపకు చెందిన సాంబశివయ్య గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. చెన్నూరు సర్వే నెం. 125 లో తనకు 1 ఎకరా 92 సెంట్ల భూమి కలదు. ఈ భూమికి సంబంధించి గతంలో కోర్టు ద్వారా తనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు 2004లో రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. ఈ భూమి గతంలో మాజీ సైనికోద్యోగికి కేటాయించినది, ఆ తర్వాత చట్టబద్ధంగా తన వద్దకు చేరింది. ప్రభుత్వం తనకు పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లు కూడా మంజూరు చేసింది. అయితే 19.09.2021 నుండి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన భూమిని 22-Aలో చేర్చి, ఆన్లైన్ రికార్డుల్లో మార్పులు చేశారు. కోర్టు డిక్రీలు, అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, రికార్డులను తారుమారు చేస్తూ నన్ను మానసిక వేదనకు గురిచేస్తున్నారు. దీనివల్ల తన భూమిపై ఉన్న హక్కులను కోల్పోవడమే కాకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.