- కరుణాకర్ రెడ్డికి వార్నింగ్: "స్వామి వారితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు"…
- కూటమి ప్రభుత్వం ముందు ఆటలు సాగవు: వైసీపీ నేతలకు గట్టి హెచ్చరికలు…
TDP Strong warnings to YCP leaders: తిరుపతిలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై కూటమి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు సంస్కారహీనులని, నిన్నటి తిరుపతి ఘటనతో ఆ విషయం మరోసారి స్పష్టంగా రుజువైందని వారు మండిపడ్డారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు వైఎస్సార్సీపీ నేతలు నిత్యం కుట్రలు పన్నుతున్నారని, గడిచిన ఐదేళ్ల పాలనలో స్వామి వారి కానుకలు మొదలుకొని బంగారం వరకు అన్నీ దోచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుమల ఎంత పవిత్రమో తిరుపతి నగరం కూడా అంతే పవిత్రమని, కానీ వీరు కావాలనే మందు బాటిళ్లు అక్కడ పెట్టి తిరుమలలో మద్యం దొరుకుతోందని అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుమల నెయ్యి కల్తీకి పాల్పడిందే కాకుండా, తిరిగి అబాండాలు కూడా ఇతరులపైనే వేస్తున్నారని, ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ నుండి వచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా జరుగుతున్న ఉన్మాదుల దాడి అని వారు అభివర్ణించారు.
టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు కుటుంబంపై వైఎస్సార్సీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడికి యత్నించడం అత్యంత హేయమైన చర్యని నేతలు పేర్కొన్నారు. బి.ఆర్.నాయుడిపై హత్యాయత్నం జరిగింది వాస్తవం కాదా అని ప్రశ్నిస్తూ, ఈ ఘటనతో ఆయన సతీమణి తీవ్ర భయాందోళనకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము గనుక అడ్డుకోవాలనుకుంటే మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తన ఇంటి నుండి బయటకు వచ్చేవాడా అని హెచ్చరించారు. ఈ రోజు ఉదయం బస్టాండ్ సమీపంలో వైఎస్సార్సీపీ మూకలు ధర్నా చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. అంబులెన్స్ వస్తే దారి ఇవ్వని పరిస్థితి సృష్టించారని, ఆ వాహనంలో ఉన్న రోగులకు ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఎవరిదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్సీపీ ధర్నాల వల్ల ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పరీక్షకు సమయం మించిపోతుంటే వారి భవిష్యత్తు ఏమైపోవాలని ప్రశ్నించారు. పరీక్షకు వెళ్లాలి దారివ్వండి అని ప్రాధేయపడిన తల్లిదండ్రులపై దాడికి వెళ్లడం వారి ఉన్మాదానికి పరాకాష్ట అని మండిపడ్డారు. తమ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందోనని తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకోవడం కలిచివేసిందని పేర్కొన్నారు. జగన్ మరియు కరుణాకర్ రెడ్డి ఉద్దేశ్యం ఏమిటని, తిరుపతిలో శాంతిభద్రతలు లేవని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నారా అని నిలదీశారు. వైఎస్సార్సీపీ నేతల ఆటలు కూటమి ప్రభుత్వంలో సాగవని, స్వామి వారితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని కరుణాకర్ రెడ్డిని హెచ్చరించారు.