- విదేశీ విద్య పేరిట కన్సల్టెన్సీ మోసంపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు..
- అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు..
Gottumukkala Raghuramaraju: ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన నరేంద్ర కుమార్ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ..కంచికచర్లకు చెందిన కొంటేటి శ్రీనివాసరావు అనే విద్యార్థికి సహాయం చేసే ఉద్దేశంతో అతడిని 'అబ్రాడ్ సొల్యూషన్స్' అనే కన్సల్టెన్సీకి పరిచయం చేశాను. శ్రీనివాసరావు కోరిక మేరకు అతని పైచదువుల నిమిత్తం విడతల వారీగా మొత్తం రూ. 13,70,000/- లను తన ఖాతా ద్వారా కన్సల్టెన్సీ యజమాని ఆలపర్తి చంద్రశేఖర్ కు బదిలీ చేశాను. యూకేలోని 'డీ మోంట్ఫోర్ట్ యూనివర్సిటీ'కి ఫీజు చెల్లించినట్లు కన్సల్టెన్సీ వారు తొలుత కొన్ని రశీదులు చూపినప్పటికీ తీరా విచారించగా యూనివర్సిటీకి పూర్తి సొమ్ము అందలేదని తేలింది.
టెక్నికల్ కారణాల పేరుతో కన్సల్టెన్సీ యజమాని చంద్రశేఖర్ ఆ సొమ్మును వెనక్కి మళ్లించినట్లు ఆధారాలు లభించాయి. దీనిపై నిలదీయగా ఆ డబ్బు దుబాయ్ ఏజెంట్ వద్ద ఆగిపోయిందని సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. అసలు నిందితుడైన కన్సల్టెన్సీ ఓనర్ నుండి డబ్బు వసూలు చేయాల్సింది పోయి విద్యార్థి శ్రీనివాసరావు, అతని తాత గద్దె వెంకటేశ్వరరావు తనపై భౌతిక దాడులకు దిగుతున్నారు. "డబ్బులు నువ్వే కట్టాలి, లేకపోతే నీ అంతు చూస్తాం" అంటూ బెదిరిస్తూ తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ విషయంపై విజయవాడ పోలీస్ కమిషనర్, సెంట్రల్ డివిజన్ ఏసీపీ గారిని ఆశ్రయించగా విచారణలో కన్సల్టెన్సీ ఓనర్ తన తప్పును ఒప్పకున్నప్పటికీ నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఏపీ స్టేట్ బిల్డింగ్ & అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజులకు అర్జీ అభ్యర్ధించాడు.
మార్కాపురం జిల్లా కనిగిరికి చెందిన సయ్యద్ అలీ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. 11 ఏళ్ల సయ్యద్ తౌషిక్ తన కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సింగరాయకొండలో ప్రముఖ పాఠశాలలో తమ కుమారుడు 6వ తరగతి చదువుతున్నాడు. ఫిబ్రవరి 14, 2026 సాయంత్రం 5:08 గంటల వరకు తమతో క్షేమంగా మాట్లాడిన తమ కుమారుడు సరిగ్గా గంట వ్యవధిలోనే (6:08 PM)మరణించినట్లు సమాచారం అందించారు. బాబు మరణానికి ముందు ఒక భవనం నుండి మరో భవనానికి తరలిస్తున్న దృశ్యాలు సిసిటివిలో ఉన్నాయని, అయితే కీలకమైన ప్రదేశాల్లోని సిసిటివి ఫుటేజీని యాజమాన్యం మాయం చేసింది. స్కూల్ యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను బాబు చూశాడన్న నెపంతో ప్రిన్సిపాల్ రమణారెడ్డి, అతని కుమారులు చైతన్య, బుజ్జి, వార్డెన్ కలిసి గొంతు నులిమి హత్య చేశారు. బాబు మెడపై గాట్లు, గొంతు భాగంలో రంధ్రం వంటి గాయాలు ఉన్నాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి న్యాయం జరగలేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం గుత్తికొండ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలోని సర్వే నెం. 696/2 (3.09 ఎకరాలు), 696/5-2 (3.76 ఎకరాలు) పరిధిలో సుమారు 266 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి 1 1/2 సెంట్ చొప్పున లే-అవుట్ వేసి ప్లాట్లను కేటాయించింది. తమకు డి.కె. పట్టాలను కూడా మంజూరు చేయడం జరిగింది. 2020వ సంవత్సరం నుండి కొందరు వ్యక్తులు ఈ లే-అవుట్ను కాదని, ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను తొలగించి తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. లబ్ధిదారులను ప్లాట్లలోకి రానివ్వకుండా అడ్డుకోవడంతో నివాసాలు కోల్పోయాం. నివాసం ఉండటానికి వేరే ఆధారం లేక, చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలతో కూడిన సుమారు 299 కుటుంబాలు ప్రస్తుతం రోడ్లపై, తాత్కాలిక షెడ్లలో జీవిస్తున్నారు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రికి చెందిన జయవర్ధన్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ శ్రీమతి ఇందిర గారి ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. తోటి ఉద్యోగులపై భౌతిక దాడులు, కుల వివక్ష, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పరీక్షల విధుల్లో ఉన్న ఎరుకల సామాజిక వర్గానికి చెందిన డిపార్ట్మెంటల్ ఆఫీసర్ భూతలింగేశ్వర్, రికార్డు అసిస్టెంట్ చక్రవర్తిపై ప్రిన్సిపల్ భౌతిక దాడికి దిగడం కలకలం రేపింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అధ్యాపకులు ఓబులమ్మ, శాంసన్ సునీల్, జయరాంలను సామాజికంగా వేధించడం ఆర్థిక ప్రయోజనాలు నిలిపివేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఆమె వేధింపుల వల్లే జూనియర్ అసిస్టెంట్ నారాయణస్వామి గత ఫిబ్రవరిలో స్వచ్ఛంద విరమణ చేశారు. ప్రిన్సిపల్ కుమారులు, వార్డెన్ కలిసి సీనియర్ అసిస్టెంట్ శివప్రసాద్పై చెప్పుతో దాడి చేసిన ఘటనపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. పదోన్నతుల పేరిట సుమారు రూ. 90 లక్షల వసూళ్లకు పాల్పడినట్లు ఏసీబీ నోటీసులు జారీ చేసినా, రాజకీయ పరపతితో విచారణలను అడ్డుకుంటున్నారు. కావునా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అరాచకాలకు పాల్పడుతున్న ప్రిన్సిపల్ ఇందిరను తక్షణమే సస్పెండ్ చేయాలని కోరాడు.
అనంతపురం జిల్లా తపోవరం గ్రామానికి చెందిన ఆనంద్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో సర్వే నంబర్ 87లో 8.06 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత 60 ఏళ్లుగా సర్వే నంబర్లు 62, 64, 65, 88 ల గుండా ఉన్న పాత రస్తా ద్వారానే తమ పొలాలకు వెళ్తున్నాం. గత రెండు సంవత్సరాలుగా సాగు చేయని సమయాన్ని ఆసరాగా తీసుకుని పొరుగున ఉన్న రైతులు ఆ పాత దారిని మూసివేశారు. దీంతో పొలంలో ఉన్న రెండు బోర్లు, పంటలు సాగు చేసుకునే అవకాశం లేక ఉపాధి కోల్పోయాం. అనంతపురం జిల్లా కలెక్టర్ గారు, 'ఈజ్మెంట్ యాక్ట్ 1882' ప్రకారం మూసివేయబడిన ప్లానింగ్ రస్తాను తెరిపించాలని తహశీల్దార్ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణకు వచ్చిన మండల తహశీల్దార్, మండల సర్వేయర్, సచివాలయ సర్వేయర్లు.. తమకు పాత ప్లాన్ చూపించకుండా, పొరుగు రైతులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్లకు చెందిన లక్షమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. మార్కాపురం జిల్లా గిద్దలూరుకు చెందిన కర్నాటి బలరామిరెడ్డి తనకు ఉన్న సర్వే నెంబర్ 34 లోని 0.95 సెంట్ల భూమిలో దేవుని గర్భగుడి కట్టిస్తానని బ్యాంక్ లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. తన నిరక్షరాస్యతను భక్తిని ఆసరాగా చేసుకుని దొంగ పత్రాలు సృష్టించి తమకు తెలియకుండానే భూమిని తన పేరు మీదకు మార్చుకున్నాడు. ఆ తర్వాత ఆ భూమిని కలసపాడుకు చెందిన ఖాజా రంతు అనే వ్యక్తికి 24 లక్షల రూపాయలకు అమ్మకానికి పెట్టి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఈ విషయం గురించి అడిగితే తనపై తన మద్దతుగా వచ్చిన పెద్దమనుషులపై బలరామిరెడ్డి దౌర్జన్యం చేస్తున్నాడు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించలని కోరారు.
వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.