వాట్సాప్ గవర్నెన్స్తో 1,035 సేవలు – ప్రజలకు సులభ సేవల అందుబాటు..
శాటిలైట్ డేటాతో రియల్టైమ్ పాలనకు సీఎం దిశానిర్దేశం..
అమరావతి: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించాలనే లక్ష్యంతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను పూర్తిగా ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. బుధవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా “మన మిత్ర” వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందించడమే లక్ష్యమని సీఎం చెప్పారు. ప్రస్తుతం ఈ వేదిక ద్వారా 1,035 సేవలు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 54 లక్షల మంది 1.78 కోట్ల సేవలను వినియోగించుకున్నారని తెలిపారు. అలాగే ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇప్పటివరకు 24 లక్షల మందికి పైగా వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు.
కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఫేజ్-1 కింద ఇప్పటికే 8 కంపెనీలకు భూములు కేటాయించగా, మే రెండో వారంలో ప్లాంట్లు ప్రారంభమవుతాయని తెలిపారు. డ్రోన్ సిటీ మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఎం, ఈ ఏడాది జూలై నాటికి మొదటి దశ పనులు పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నేర నియంత్రణలో సీసీ కెమెరాల వినియోగం కీలక పాత్ర పోషిస్తోందని అధికారులు వివరించారు. ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పర్యవేక్షణ ఎక్కువగా జరుగుతోందని తెలిపారు. దీంతో నేరాల గుర్తింపు, మిస్సింగ్ కేసుల పరిష్కారం, వాహనాల దొంగతనాల విచారణ వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. అయితే ఇంకా సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో ప్రైవేట్ కెమెరాల డేటాను కూడా ఇంటిగ్రేట్ చేయాలని సీఎం సూచించారు.
ఇక శాటిలైట్ సమాచారాన్ని కూడా వినియోగంలోకి తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్తో శాటిలైట్ డేటాను అనుసంధానం చేస్తే, సమస్యలు ముందుగానే గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవచ్చని అన్నారు. ఇటీవల తిరుమల సమీపంలోని శేషాచల అటవీ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని ఉదాహరణగా చూపిస్తూ, ఇలాంటి ఘటనలకు రియల్ టైమ్లో స్పందించే వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు.
డీజిల్, పెట్రోలు సరఫరాలో తలెత్తిన సమస్యలను ప్రభుత్వం వేగంగా పరిష్కరించిందని, కానీ భవిష్యత్తులో సమస్యలు ఏర్పడకముందే ముందస్తు చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సీఎం సూచించారు. టెక్నాలజీ ఆధారిత పాలన ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఈ సమీక్షలో స్పష్టమైంది.