- సౌదీలో ప్రప్రథమంగా తెలుగుదేశం ఇఫ్తార్: ఐక్యతను చాటిన ప్రవాసాంధ్రులు..
- విమానం రద్దైనా ఆగని ఉత్సాహం: వీడియో కాల్ ద్వారా ప్రవాసీయులతో మాట్లాడిన ఎమ్మెల్యే..!
Saudi Arabia Celebrations: సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. ప్రప్రథమంగా అక్కడ నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమం ఒక వైపు రంజాన్ ఆధ్యాత్మికతను, సోదరభావాన్ని ప్రతిబింబించగా, మరో వైపు ఎడారి దేశంలో తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానాన్ని చాటిచెప్పింది. ప్రాంతీయంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ, శుక్రవారం సాయంత్రం రియాధ్ నగరంలో టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఈ వేడుక అత్యంత ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా మదనపల్లె శాసన సభ్యుడు షాజహాన్ బాషా మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా, మానవీయ కోణంలో చూసే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లోని ముస్లింలు, ఇతర మైనారిటీ వర్గాలు ముఖ్యమంత్రిపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొనాల్సి ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో విమానం రద్దు కావడంతో వీడియో కాల్ ద్వారా ప్రవాసాంధ్రులతో మాట్లాడి వారిలో ఉత్సాహం నింపారు.
ప్రవాసీ కార్మికులకు చేరువగా ఉండాలనే ఉద్దేశంతో ఈ విందును ఖరీదైన హోటళ్లలో కాకుండా కార్మిక క్షేత్రంలోనే (లేబర్ క్యాంప్) నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణా మాట్లాడుతూ, ఇటీవల బహ్రెయిన్లో చిక్కుకుపోయిన క్రైస్తవ పాస్టర్లను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో చంద్రబాబు నాయుడు చూపిన చొరవను గుర్తుచేశారు. ఎన్నారై నాయకులు జానీ బాషా, రాజశేఖర్ మరియు ఖాలీద్ సైఫుల్లాలు ప్రసంగిస్తూ, ప్రతి ప్రవాసాంధ్రుడికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయకేతనం ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ భారీ కార్యక్రమ విజయవంతానికి సారథి నాయుడు, భవానీ శంకర్, హరి, నరేశ్ చెన్నుపాటి సహా పలువురు నాయకులు సమన్వయకర్తలుగా వ్యవహరించగా, శిల్పా గడ్డం, అక్షిత, జయలక్ష్మి వంటి మహిళా ప్రతినిధులు రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఇఫ్తార్ విందు అనంతరం నిర్వహించిన కార్ల ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు సైతం కులమతాలకు అతీతంగా ఇందులో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రవాసీయులు సౌదీలో అత్యధిక సంఖ్యలో ఉండటంతో, ఈ కార్యక్రమం వారిలో గొప్ప ఉత్సాహాన్ని నింపింది.