అమెరికాలో ఎన్టీఆర్ స్ఫూర్తితో మినీ మహానాడు నిర్వహణ..
ప్రవాసాంధ్రులతో కిక్కిరిసిన వర్జినియా మినీ మహానాడు..
ఎన్టీఆర్ వారసత్వం, లోకేష్ నాయకత్వంపై మినీ మహానాడులో చర్చ..
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ సమీపంలోని వర్జినియాలో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించిన “మినీ మహానాడు” వేడుకలు తెలుగు రాజకీయ, సాంస్కృతిక స్పూర్తిని ప్రతిబింబించాయి. స్థానికంగా నివసిస్తున్న తెలుగు కుటుంబాలు, ముఖ్యంగా తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జ్యోతి ప్రజ్వలనతో పాటు “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” గీతాలాపనతో వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో ప్రారంభమయ్యాయి. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి మహానాడు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి భానుప్రకాష్ మాగులూరి అధ్యక్షత వహించగా, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమెరికాలో ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకలాపాలను సమన్వయం చేస్తున్న జయరాం కోమటి సహకారంతో ఈ మహానాడు నిర్వహించబడింది.
ఈ సందర్భంగా మాట్లాడిన మన్నవ సుబ్బారావు, ఎన్టీఆర్ను తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిరస్థాయిగా నిలిచిన మహానేతగా అభివర్ణించారు. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల ప్రయోజనాల కోసమేనని అన్నారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించడమే కాకుండా, రాజకీయంగా కూడా వారిని శక్తివంతం చేసిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. మే 28 కేవలం ఎన్టీఆర్ జన్మదినం మాత్రమే కాదని, తెలుగు జాతి ఆత్మగౌరవం మేల్కొన్న రోజు అని వ్యాఖ్యానించారు.
ఈసారి మహానాడు ప్రత్యేకత ఏమిటంటే, ఎన్టీఆర్, చంద్రబాబు తర్వాత మూడో తరం నాయకత్వంగా నారా లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టడం అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచిస్తున్న పొదుపు విధానాలను పాటిస్తూ దేశానికి ఆదర్శంగా టీడీపీ మహానాడు నిర్వహించబడుతుందని తెలిపారు.
భాను మాగులూరి మాట్లాడుతూ, “సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అనే భావజాలంతో ఎన్టీఆర్ పాలన సాగిందన్నారు. ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటాయని పేర్కొన్నారు. చంద్రబాబు దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పయనించిందని, నారా లోకేష్ ఆధునిక ఆలోచనలతో కొత్త తరానికి నాయకత్వం వహిస్తున్నారని అన్నారు.
యశస్వి బొద్దులూరి మాట్లాడుతూ, తెలుగు నేల ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. కళారంగం, సేవారంగం ద్వారా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేతగా ఎన్టీఆర్ను గుర్తు చేశారు.
సాయి బొల్లినేని మాట్లాడుతూ, నాలుగున్నర దశాబ్దాలుగా ఎన్టీఆర్ స్ఫూర్తి టీడీపీ కార్యకర్తల హృదయాల్లో నిలిచిపోయిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎదగడంలో చంద్రబాబు దార్శనికత, సాంకేతిక అభివృద్ధి కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
చంద్రమోహన్ బేవర, రామ్ ప్రసాద్ మైనేని మాట్లాడుతూ, ఎన్టీఆర్ పేదల, మహిళల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే నాయకుడని కొనియాడారు. చివరగా జయరాం కోమటి సహా కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మినీ మహానాడులో పలు ముఖ్య తీర్మానాలు కూడా ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రవాసాంధ్రుల ఆస్తుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. రాష్ట్ర యువతకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ఎన్నారై నిపుణుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎన్నారైలు పంపించే నిధులకు గతంలో అమలైన “జన్మభూమి” తరహాలో రాష్ట్ర ప్రభుత్వం మాచింగ్ గ్రాంట్లు మళ్లీ పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతూ తీర్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో మన్నే సత్యనారాయణ, జానకిరామ్ భోగినేని, రమేష్ అవిర్నేని, కిషోర్ కంచెర్ల, పయ్యావుల చక్రవర్తి, సుశాంత్ మన్నే, ఫణి యలమంచిలి, అరుణ్, రాజేష్ అడివి, మురళి బచ్చు, బాబు వేమన, సామినేని వెంకటేశ్వరరావు, సీతారామారావు, గోవర్ధన్, సుబ్బారావు, వెంకట రెడ్డి, చంద్రనాధ్ తదితరులు పాల్గొన్నారు.