Business- తిరుపతి ఐఓసీఎల్ బంక్ వద్ద కిలోమీటర్ల మేర క్యూ….
నిల్వలు ఉన్నంత వరకు ఉచితమే…
రొమ్మల రాజేష్ రెడ్డి ఉదారత: తనపల్లి రోడ్డులో వాహనదారులకు 'ఫ్రీ' పెట్రోల్…
Free Petrol Tirupati: తిరుపతి నగరంలో పెట్రోల్ కొరత ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఒక పెట్రోల్ బంక్ యజమాని చూపిన ఉదారత అందరినీ ఆశ్చర్యపరిచింది. తనపల్లి రోడ్డులోని ఐఓసీఎల్ (IOCL) పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులకు ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేయడంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పెట్రోల్ దొరకక ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిచ్చింది.
బంకు యజమాని రొమ్మల రాజేష్ రెడ్డి తన ఉదార స్వభావాన్ని చాటుకుంటూ, రొమ్మల రాజేష్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ద్విచక్ర వాహనదారునికి ఒక లీటర్ పెట్రోల్ను ఉచితంగా అందజేశారు. పెట్రోల్ కొరత వార్తలతో ఆందోళన చెందుతున్న ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఉచిత పెట్రోల్ పంపిణీ వార్త దావానంలా వ్యాపించడంతో తనపల్లి రోడ్డు ఒక్కసారిగా వాహనదారులతో కిటకిటలాడింది. కిలోమీటర్ల మేర ద్విచక్ర వాహనాలు బారులు తీరాయి. చమురు నిల్వలు నిండుకుంటున్నాయన్న భయం నుంచి బయటపడి, తమ వాహనాల్లో ఉచితంగా పెట్రోల్ పోయించుకోవడానికి జనం పోటీ పడ్డారు. పరిస్థితిని గమనిస్తూ బంక్ సిబ్బంది పంపిణీని క్రమబద్ధీకరించారు.
ప్రజల్లో పెట్రోల్ కొరతపై ఉన్న భయాందోళనలు పూర్తిగా తొలగిపోయే వరకు ఈ ఉచిత పంపిణీని కొనసాగిస్తామని రాజేష్ రెడ్డి ప్రకటించారు. తన బంకులో పెట్రోల్ నిల్వలు ఉన్నంత వరకు సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఈ సేవలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. లాభాపేక్ష లేకుండా కష్టకాలంలో ఆయన చేసిన ఈ సాయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి చూస్తున్న వాహనదారులకు ఈ ఒక లీటర్ పెట్రోల్ గొప్ప వరంగా మారింది. సంక్షోభం సమయంలో తోటి వారికి సాయం చేయాలనే రాజేష్ రెడ్డి ఆలోచనా దృక్పథం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. రాజకీయాలకు అతీతంగా కేవలం సేవా దృక్పథంతో చేసిన ఈ పని ఇప్పుడు తిరుపతిలో హాట్ టాపిక్గా మారింది.