- కానిస్టేబుల్ అబ్దుల్లాకు 60 శాతం గాయాలు: ఎన్ఆర్ఐ వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న మంత్రి..
- Politics: క్షతగాత్రుల పరిస్థితిని పర్యవేక్షిస్తున్న కృష్ణా జిల్లా ఎస్పీ: బాధితులకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు..
Mangalagiri Home Minister Anita: కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పేలుడు ఘటనలో గాయపడిన పోలీసులను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని ఆమె పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయాలైన పోలీసులకు ధైర్యం చెప్పిన మంత్రి, వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతులు లేకుండా క్రాకర్స్ విక్రయిస్తున్న దుకాణాల నుంచి సీజ్ చేసిన పేలుడు పదార్థాలను కోర్టుకు తరలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందని చెప్పారు. ఈ ఘటనలో ఎస్సై, కోర్ట్ కానిస్టేబుల్ మరియు ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడినట్లు వివరించారు. అబ్దుల్లా అనే కానిస్టేబుల్కు 50-60 శాతం గాయాలున్నాయని, మిగతా వారికి ప్రాణాపాయం లేదని మంత్రి తెలిపారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. గాయపడిన పోలీసులందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి, వారి కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. అత్యుత్తమ వైద్యం అందిస్తున్న ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైద్య బృందానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.