Banking News: దేశంలో ధరల మంట మళ్లీ మొదలైంది సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతూ చిల్లర ద్రవ్యోల్బణం (CPI) గత 14 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. మార్చి నెలలో వినియోగదారుల ధరల సూచీ 3.4 శాతానికి పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో ఇది 3.21 శాతంగా ఉండగా, కేవలం ఒక్క నెలలోనే ఈ స్థాయిలో మార్పు రావడం గమనార్హం.
ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధానంగా ఆహార వస్తువుల ధరలే కారణమయ్యాయి. ఫిబ్రవరిలో 3.47 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం, మార్చి నాటికి 3.87 శాతానికి చేరింది. వాతావరణ మార్పుల వల్ల పంటల దిగుబడి తగ్గడం, మరోవైపు అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధ వాతావరణం వల్ల సరఫరాలో ఇబ్బందులు తలెత్తడం ధరల పెరుగుదలకు దారితీశాయి. పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు మార్కెట్లో సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత కొంతకాలంగా వడ్డీ రేట్లను పెంచకుండా స్థిరంగా ఉంచిన ఆర్బీఐ, ఇప్పుడు మళ్లీ రేట్లు పెంచే దిశగా అడుగులు వేయవచ్చని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ 'బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా ప్రకారం, ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్లు అర శాతం పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే, సామాన్యుల ఇంటి రుణాలు కారు రుణాలపై ఈఎంఐ భారం మరింత పెరగనుంది.
మరోవైపు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు కూడా భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరగడం వల్ల ముడి చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి, పరోక్షంగా అన్ని వస్తువుల ధరలపై ప్రభావం పడుతుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం 4 శాతం మార్కును దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొటక్ సెక్యూరిటీస్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్ణయించిన 4 శాతం పరిమితి లోపే ఉన్నప్పటికీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే కఠిన నిర్ణయాలు తప్పవని తెలుస్తోంది. అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ, ఇటు పట్టణాల్లోనూ ధరల పెరుగుదల ఒకేలా ఉండటం ఆందోళనకరమైన విషయం. ప్రభుత్వం ధరలను అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఏదేమైనా, పెరుగుతున్న ధరలు మరియు పెరగనున్న వడ్డీ రేట్ల భయంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు.