Agriculture News: తెలంగాణలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. యాసంగి సీజన్కు సంబంధించి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా రెండో విడత నిధుల విడుదలకు సర్కార్ ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ 15వ తేదీ కల్లా అర్హులైన రైతులందరి బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం నగదును జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేయగా, క్షేత్రస్థాయిలో రైతుల వివరాల సేకరణ నిధుల సర్దుబాటు ప్రక్రియ వేగంగా జరుగుతోంది.
ఈ పథకం అమలులో భాగంగా ప్రభుత్వం ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే మార్చి నెలలో మొదటి విడత కింద ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదును జమ చేసింది. ఇప్పుడు రెండో విడతలో భాగంగా సుమారు 2,700 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు నిధులను సిద్ధం చేసింది. ఈ విడతలో కూడా ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న ప్రతి రైతుకు ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.
మొదటి విడతలో ప్రభుత్వం చిన్న రైతులకు పెద్ద పీట వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో విడతలో ఒక ఎకరం నుండి ఐదు ఎకరాల మధ్య భూమి ఉన్న రైతుల ఖాతాల్లో బ్యాలెన్స్ సొమ్మును జమ చేయనున్నారు. అంటే మొదటి విడతలో అందిన మొత్తాన్ని మినహాయించి, మిగిలిన అర్హత ఉన్న మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో వేస్తారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అన్నదాతలకు సాగు పనుల కోసం అవసరమైన పెట్టుబడి సాయం సకాలంలో అందనుంది.
కేవలం రెండో విడతతోనే ఆగకుండా, ఏప్రిల్ నెలాఖరు నాటికి మూడో విడత నిధులను కూడా విడుదల చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ యాసంగి సీజన్ ముగిసేలోపు రైతులకు కేటాయించిన మొత్తం 9,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని పంపిణీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇలా విడతల వారీగా నగదును విడుదల చేయడం వల్ల సాగు ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. నెలాఖరు లోపు ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసేలా యంత్రాంగం పనిచేస్తోంది.
అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకం ప్రయోజనం అందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను గట్టిగా ఆదేశించారు. సాఫ్ట్వేర్ సమస్యలు లేదా బ్యాంక్ ఖాతా వివరాల్లో తప్పుల వల్ల ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదని స్పష్టం చేశారు. నేరుగా నగదు బదిలీ పద్ధతి ద్వారా ఈ నిధులు జమ అవుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేసవి సాగులో ఎరువులు, విత్తనాలు ఇతర ఖర్చుల కోసం ఈ డబ్బులు ఎంతో ఆసరాగా నిలుస్తాయని రైతాంగం భావిస్తోంది.