కర్ణాటక విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త చెప్పింది. ఇకపై పదో తరగతి విద్యార్థులు ఫెయిలవుతారేమో అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పబ్లిక్ పరీక్షల్లో పాస్ మార్కులు తగ్గిస్తూ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్లో కనీసం 35 మార్కులు తెచ్చుకోవాల్సి ఉండేది. కానీ ఇకపై కేవలం 33 మార్కులు వచ్చినా పాస్గా పరిగణిస్తారు. ఈ నిర్ణయం విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచడానికే తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది.
కర్ణాటక ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప మాట్లాడుతూ, అనేక మంది విద్యార్థులు 1 లేదా 2 మార్కుల తేడాతో ఫెయిల్ అవుతున్నారని, దాంతో వారు ఉన్నత విద్యను కొనసాగించలేకపోతున్నారని తెలిపారు. ఆ గ్యాప్ సమయంలో కొంతమంది విద్యార్థులను తల్లిదండ్రులు పనులకు పంపడం, ముఖ్యంగా అమ్మాయిలను చిన్న వయసులోనే పెళ్లి చేయడం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు. ఈ సమస్యలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని పాస్ మార్కులను తగ్గించడం ద్వారా విద్యార్థులకు రెండవ అవకాశాన్ని ఇవ్వడమే తమ ఉద్దేశమని చెప్పారు.
మంత్రి మధు బంగారప్ప తెలిపిన వివరాల ప్రకారం, ఈ కొత్త నియమం ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తుంది. ఇది ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే కాకుండా ప్రైవేట్ పాఠశాలలకు కూడా వర్తించనుంది. ఇప్పటివరకు ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల కోసం వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి చిన్న తప్పిదం కారణంగా వారు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉండదు. ఈ మార్పు విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతుందని మంత్రి నమ్మకం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఎస్ఎస్ఎల్సీ (10th Class) మొత్తం మార్కులు 625 కాగా, వాటిలో 33 శాతం అంటే 206 మార్కులు సాధించిన విద్యార్థులు ఉత్తీర్ణులవుతారని ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యకు ప్రోత్సాహం ఇవ్వడంలో ఇది మరో సానుకూల అడుగు అని విద్యావేత్తలు కూడా అభినందిస్తున్నారు.