రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో గొప్ప డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న ఆర్జీవి, ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తనకు నచ్చిన వ్యక్తులు, సినిమాల గురించి సానుకూలంగా చెబుతారు. అదే సమయంలో, ఎవరినైనా విమర్శించాలంటే ఆయనకు ఎవరూ సాటిరారని చెప్పుకోవచ్చు. తాజాగా, హీరో తేజ సజ్జ నటించిన 'మిరాయి' చిత్రంపై 'ఎక్స్' లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇంత పెద్ద యాక్షన్ సినిమాలో తేజ సజ్జల చాలా చిన్నవాడిలా కనిపిస్తారని అనుకున్నాను, కానీ నేను మీ నటన చూసిన తర్వాత నేను రెండింతలు తప్పుగా ఆలోచించాను అని చెప్పుకొచ్చారు. అదేవిధంగా విలన్ పాత్రలో మనోజ్ ని ఎందుకు తీసుకున్నారా అని అనుకున్నాను అయితే ఆయన పట్ల ఆ ఉద్దేశం తప్పని ఈ చిత్రంలో మంచు మనోజ్ అద్భుతమైన నటన చూసి నాపై నేను కోప్పడ్డాను అని తెలిపారు. మిరాయి' సినిమా చూసిన తర్వాత ₹400 కోట్లకు పైగా బడ్జెట్తో తీసిన సినిమాల్లో కూడా ఇంత గొప్ప విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఎప్పుడు చూడలేదని ఆర్జీవి ప్రశంసించారు.
విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ప్లే అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత వచ్చిన సన్నివేశాలు ఆధ్యాత్మిక అంశాలు గొప్ప అనుభూతినిచ్చాయి. కత్తులు, మంత్రాలు, అతీంద్రియ శక్తుల మధ్య కూడా సినిమా కుటుంబం, బాధ్యత, ప్రేమ, నమ్మకద్రోహం వంటి అంశాలను చాలా స్పష్టంగా చిత్ర చిత్ర యూనిట్ చూపించింది అని తెలిపారు.
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఒక అద్భుతమైన కలను నిజం చేశారు. కథ, విజువల్స్, వీరత్వం అన్నీ కలిసిన ఈ సినిమా అన్ని విభాగాలపై కార్తీక్కు ఉన్న పట్టును నిరూపించింది," అని అన్నారు.అదేవిధంగా నిర్మాత విశ్వప్రసాద్ గురించి మాట్లాడుతూ, విశ్వప్రసాద్ సినిమా కుటుంబం నుండి రాకపోయినా, ఇండస్ట్రీ నిపుణుల హెచ్చరికలను లెక్కచేయకుండా ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లారు. ఇది 'అదృష్టం ధైర్యవంతులకే వరిస్తుంది' అనే నానుడిని నిజం చేసింది, అని ప్రశంసించారు.
ఒక సినిమా బృందం పని కేవలం లాభాలు సంపాదించడం కాదు, జీవితాంతం గుర్తుండిపోయే గొప్ప కావ్యాలను సృష్టించడం. ఈ సినిమాలో కొన్ని షాట్లు భక్తి పాటల్లా, యాక్షన్ సన్నివేశాలు పూజల్లా అనిపించాయి.నిజానికి ఇది చాలా పెద్ద సినిమా, కానీ ప్రేక్షకులు దాన్ని గొప్పగా కీర్తించే వరకు తన గొప్పతనం గురించి చెప్పుకోలేదు," అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.