TDP: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీడీపీ సైకిల్ యాత్రకు శ్రీకారం!

TDP: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు.

Published : 2026-06-04 15:26:00

పర్యావరణ పరిరక్షణకు సైకిల్ వినియోగమే మార్గం: పల్లా శ్రీనివాసరావు..

‘నా దేశం – నా బాధ్యత’.. ఇంధన వినియోగం తగ్గించాలని పిలుపు..

మంగళగిరి: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సమాజానికి చేరవేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు సాధారణ ప్రజలు కూడా సాధ్యమైనంత వరకు సైకిళ్లను వినియోగించాలని పిలుపునిచ్చారు. సైకిల్ వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్య పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో హెలిప్యాడ్ నుంచి విడిది కేంద్రం వరకు సైకిల్‌పై ప్రయాణించనున్నట్లు పల్లా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తమ రోజువారీ కార్యక్రమాలకు సైకిళ్లను వినియోగించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటాలని కోరారు.

ప్రస్తుతం ప్రపంచం వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, తగ్గుతున్న పచ్చదనం వంటి సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. పర్యావరణాన్ని కాపాడడం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ అవగాహనను పెంచేందుకే సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

సైకిల్ వినియోగం వల్ల వాహనాల నుంచి వెలువడే కాలుష్యం తగ్గుతుందని, ఇంధన వినియోగం తగ్గడంతో పాటు ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. ప్రకృతికి మేలు చేసే చిన్న చిన్న చర్యలే భవిష్యత్తులో పెద్ద మార్పులకు దారి తీస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన “నా దేశం – నా బాధ్యత” అనే పిలుపును గుర్తుచేస్తూ, ప్రతి ఒక్కరూ ఇంధన వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని సూచించారు. దీనివల్ల ఇంధన పొదుపుతో పాటు వాతావరణ కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చని చెప్పారు.

వాహనాల నుంచి వెలువడే విషపూరిత వాయువుల కారణంగా కర్బన్ కాలుష్యం పెరిగి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతోనే ఈ ఏడాది మహానాడు కార్యక్రమాన్ని హైబ్రిడ్ విధానంలో నిర్వహించామని తెలిపారు. సుమారు 24 లక్షల మందికి పైగా కార్యకర్తలు డిజిటల్ వేదిక ద్వారా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చెప్పారు.

రేపు నిర్వహించే సైకిల్ యాత్రలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషించాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. “పర్యావరణ పరిరక్షణకు నేను సైతం” అనే భావనతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు.

Spotlight

Read More →