Pawan Kalyan: ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకల్లో పవన్ కళ్యాణ్.. 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీకి శ్రీకారం!

Pawan Kalyan: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా మూలపాడులోని బటర్ ఫ్లై పార్క్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు.

Published : 2026-06-05 14:53:00

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రీన్ మిషన్‌కు శ్రీకారం..

మహిళలు, చిన్నారులతో కలిసి విత్తన బంతులు తయారు చేసిన పవన్ కళ్యాణ్..

ఎన్టీఆర్ జిల్లా: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా మూలపాడులోని బటర్ ఫ్లై పార్క్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ (విత్తన బంతులు) తయారు చేసే మహత్తర కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి పవన్ కళ్యాణ్ స్వయంగా సీడ్ బాల్స్ తయారు చేశారు. అంకుడు, తెల్లపొణికి, వేప, కుంకుడు, రావి, మర్రి, వెదురు, ఉసిరి, చింత, మోదుగ వంటి స్వదేశీ జాతుల విత్తనాలతో ఈ విత్తన బంతులను తయారు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 300 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. మూలపాడు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల్లో జరుగుతున్న సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పాల్గొంటున్న ప్రజలతో మాట్లాడి, విత్తనాల ఎంపిక, తయారీ పరిమాణం వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

వన సంరక్షణకు కృషి చేసిన మహనీయుల స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించిన ఆయన, సీడ్ బాల్స్ ప్రాముఖ్యతను వివరించిన చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు. జూన్ 15వ తేదీ నాటికి 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం డ్రోన్ల సహాయంతో కొండ ప్రాంతాల్లో విత్తన బంతులను వెదజల్లే ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ విధానం ద్వారా అడవుల విస్తరణకు, పచ్చదన పెంపుదలకు తోడ్పాటు అందుతుందని అధికారులు వివరించారు.

కార్యక్రమంలో భాగంగా బటర్ ఫ్లై పార్క్‌లో ఏర్పాటు చేసిన అటవీ శాఖ స్టాల్స్‌ను పవన్ కళ్యాణ్ సందర్శించారు. పార్క్ నమూనాలో ఏర్పాటు చేసిన యోగా హాల్ ఆయనను ఆకట్టుకోవడంతో, రాష్ట్రంలోని ప్రతి ఎకో టూరిజం పార్కులో ఒక యోగా హాల్ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

అలాగే కొండపల్లి కొయ్య బొమ్మలు, ఉదయగిరి కళాకారుల చేతి వృత్తి ఉత్పత్తులను పరిశీలించారు. చెక్కతో తయారు చేసిన వాచ్‌లు, ల్యాప్‌టాప్ నమూనాలు ఆయనను ఆకట్టుకున్నాయి. బొమ్మల తయారీకి అవసరమైన చెక్క అందుబాటులో లేదని కళాకారులు చెప్పడంతో, వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు విగ్రహాన్ని కొయ్య బొమ్మల కళాకారులతో తయారు చేయించాలని కోరిన పవన్ కళ్యాణ్, ఈ అద్భుత కళారూపాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి చేతివృత్తుల కళాకారులతో సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, అటవీ మరియు పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ పీవీ చలపతిరావు, అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సంప్రదాయ కళలకు ప్రోత్సాహం ఇవ్వాలనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Spotlight

Read More →