Minister Payyavula Keshav: ప్రతిపక్షాన్ని మేం కాదు.. ప్రజలే తుడిచిపెట్టేశారు! ఆ పార్టీ రాష్ట్రానికి..

Minister Payyavula Keshav: అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ప్రసంగించిన శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్

Published : 2026-03-28 17:12:00
  • శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత: కేంద్రానికి చారిత్రాత్మక తీర్మానం పంపుతున్న ఏపీ ప్రభుత్వం..
     
  • Politics: రాజధాని లేనప్పుడు బస్సులోనే నిద్రించి పాలన: చంద్రబాబు నిబద్ధతను గుర్తుచేసిన మంత్రి..

Minister Payyavula Keshav: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని అమరావతిపై జరిగిన కీలక చర్చలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గత వైకాపా ప్రభుత్వంపై, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు రాజధానుల అంశంపై వివిధ సందర్భాల్లో జగన్ పరస్పర విరుద్ధంగా మాట్లాడిన వీడియోలను సభలో ప్రదర్శించిన మంత్రి, ఆయన తన మాటలతో ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేశారని విమర్శించారు. సాధారణంగా ఏ ముఖ్యమంత్రయినా రాష్ట్ర అభివృద్ధి కోసం తపన పడతారని, కానీ జగన్ మాత్రం కేవలం రాజకీయం కోసమే పనిచేశారని మండిపడ్డారు. రాష్ట్రం అంటే జగన్‌కు కేవలం కుట్రలు, కుతంత్రాలకు వేదికగా మాత్రమే కనిపించిందని, ప్రజల సంక్షేమం లేదా వారి కుటుంబాల బాగు ఆయనకు ఎప్పుడూ ప్రాధాన్యత కాలేదని ఆరోపించారు. జగన్ హయాంలో జరిగిన విధ్వంసం చూసి రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని, ఆయన 'ఫేస్ వాల్యూ' చూసి ఏ పారిశ్రామికవేత్తా ఏపీ వైపు చూడలేదని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర విభజన తర్వాత ఎదురైన గడ్డు పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఒక యోగిలా రాష్ట్రాన్ని నిలబెట్టారని పయ్యావుల కొనియాడారు. రాజధాని లేని సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా బస్సులోనే పడుకుని పాలన సాగించిన చరిత్ర చంద్రబాబుదని, అటువంటి నిబద్ధత కలిగిన నేత దన్నుతోనే ఏపీ ఇన్ని సవాళ్లను అధిగమించి నిలబడిందని పేర్కొన్నారు. 53 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ వల్లే రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు విజన్‌తో రూపొందిన హైదరాబాద్ నేడు తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిందని, అదే తరహాలో అమరావతిని ఆంధ్రప్రదేశ్‌కు 'గ్రోత్ ఇంజన్'గా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు. అమరావతి అనే పురిటిబిడ్డను చంపేసేందుకు వైకాపా శతవిధాలా ప్రయత్నించిందని, కానీ ఇప్పుడు ఆ రాజధానిని మరింత వైభవంగా పునర్నిర్మిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.

వైకాపా పాలనలో శాసనసభ, మండలి వేదికగా సాగిన 'శాడిజం, సైకోయిజం' మరియు రాజధాని రైతులపై జరిగిన దాష్టీకాలను ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని మంత్రి పయ్యావుల అన్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ పాలన సాగించిన జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వైకాపా నేతలు ఇంకా విషప్రచారం మానడం లేదని, అందుకే అమరావతికి పూర్తి చట్టబద్ధత కల్పిస్తూ శాశ్వత రాజధానిగా ఉండేలా కేంద్రానికి తీర్మానం పంపిస్తున్నామని ప్రకటించారు. ప్రజలే గత ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టేశారని, రాజధాని కోసం జోలె పట్టిన నాటి రోజులను గుర్తు చేసుకుంటూ, అమరావతికి అండగా నిలిచిన న్యాయవ్యవస్థకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని యువతకు, మహిళలకు ఉపాధి, ఉన్నత అవకాశాలు కల్పించే ఏకైక వేదిక అమరావతి అని, దీని నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పయ్యావుల కేశవ్ తన ప్రసంగంలో ఉద్ఘాటించారు.

Spotlight

Read More →