- Politics: "రైతులు, ఆక్వా రంగానికి కూపన్ సిస్టమ్": డీజిల్ సరఫరాలో ప్రాధాన్యత కల్పించిన మంత్రి నిమ్మల..
- "బ్లాక్ మార్కెటింగ్ చేస్తే ఊపేక్షించేది లేదు": కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలకు ఆదేశం..
Minister Nimmala: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. పట్టణంలోని మూడు ముఖ్య కూడళ్ళలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి మజ్జిగ చలివేంద్రాలను ఆయన ప్రారంభించారు. ప్రతి ఏటా సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మంత్రి, బాటసారులకు, సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు.
మరోవైపు జిల్లాలో తలెత్తిన పెట్రోల్, డీజిల్ కొరతపై మంత్రి నిమ్మల రామానాయుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. ఎన్నికల అనంతరం ఇంధన ధరలు పెరుగుతాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం అపోహలేనని, ప్రజలు వాటిని నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది ఏప్రిల్తో పోలిస్తే సరఫరాలో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ వంటి కంపెనీలు సాంకేతిక కారణాలతో ఉత్పత్తిని తగ్గించడం వల్లే ఈ తాత్కాలిక ఇబ్బంది తలెత్తిందని వివరించారు. ముఖ్యంగా పవర్ కట్, ఆక్వా రంగం మరియు ధాన్యం కోతల నేపథ్యంలో డీజిల్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని, దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని హామీ ఇచ్చారు.
కృత్రిమ కొరతను సృష్టించి పెట్రోల్, డీజిల్ను బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతులకు మరియు ఆక్వా రంగానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూపన్ సిస్టమ్ ద్వారా ఇంధన సరఫరా చేయాలని, ఇందుకోసం రెవెన్యూ మరియు వ్యవసాయ అధికారులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. వాస్తవ డిమాండ్ కంటే సరఫరాను పెంచడం ద్వారా రాబోయే ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజావసరాలను ఆసరాగా చేసుకుని ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు.