Hajj: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరుగుదల!

Hajj: ఇరాన్-అమెరికా యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న వేళ, ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లే భక్తులపై కూడా దాని భారం పడుతోంది.

Published : 2026-05-31 19:48:00

గల్ఫ్ సంక్షోభ ప్రభావం.. హజ్ యాత్రికులపై అదనపు భారం..

హజ్ సీజన్ ముందు సౌదీ విమాన ఛార్జీలకు రెక్కలు..

ఇరాన్-అమెరికా యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న వేళ, ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లే భక్తులపై కూడా దాని భారం పడుతోంది. గల్ఫ్ ప్రాంతంలో విమాన రాకపోకలకు అంతరాయం కలగడం, ఇంధన ధరలు పెరగడం వల్ల హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో లక్షలాది మంది ముస్లిం యాత్రికులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

ప్రతి ముస్లింకు జీవితంలో ఒకసారి అయినా మక్కా నగరానికి వెళ్లి హజ్ యాత్ర చేయడం పవిత్ర కర్తవ్యంగా భావిస్తారు. అయితే ఈసారి యాత్రకు ముందు నుంచే పెరిగిన విమాన ఛార్జీలు, ట్రావెల్ ప్యాకేజీలు యాత్రికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

మిడిల్ ఈస్ట్ లో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఈజిప్టులో హజ్ ప్రయాణ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. గతంలో సుమారు 30 వేల ఈజిప్షియన్ పౌండ్లు ఉన్న విమాన టికెట్ ధర ఇప్పుడు 50 వేల పౌండ్లకు చేరిందని అక్కడి టూరిజం ఫెడరేషన్ వెల్లడించింది. అలాగే హజ్ ట్రావెల్ ప్యాకేజీలు కూడా 30 శాతం వరకు పెరిగాయి. కొన్ని ప్యాకేజీ లు 70 వేల పౌండ్ల నుంచి 90 వేల పౌండ్లకు చేరాయి.

కువైట్‌కు చెందిన జజీరా ఎయిర్వేస్ సంస్థ ఈ ఏడాది రష్యా, మధ్య ఆసియా దేశాల నుంచి 30 వేలకుపైగా యాత్రికులను సౌదీ అరేబియాకు తరలిస్తోంది. ఇంధన ధరలు పెరగడం వల్ల తమ విమాన ఛార్జీలు 40 శాతం వరకు పెరిగాయని సంస్థ తెలిపింది.

ప్రయాణ సేవల సంస్థ ‘వేగో’ సమాచారం ప్రకారం, భారత్, పాకిస్తాన్, ఈజిప్ట్ వంటి ప్రధాన ముస్లిం దేశాల నుంచి సౌదీకి వెళ్లే విమాన ఛార్జీలు గత ఏడాదితో పోలిస్తే 20 నుంచి 40 శాతం వరకు పెరిగాయి. కొన్ని మార్గాల్లో అయితే దాదాపు 50 శాతం పెరుగుదల నమోదైంది.

గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, సౌదీ అరేబియాపై ప్రత్యక్ష ప్రభావం తక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రయాణ వ్యయాలు పెరగడం వల్ల ప్రతి సంవత్సరం హజ్ కోసం విదేశాల నుంచి వెళ్లే 15 లక్షలకుపైగా యాత్రికులపై అదనపు భారం పడనుంది.

సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థలో మత పర్యాటకం కీలక పాత్ర పోషిస్తోంది. ఎన్నో ఏళ్లుగా హజ్, ఉమ్రా యాత్రల ద్వారా దేశానికి స్థిరమైన ఆదాయం లభిస్తోంది. ప్రస్తుతం కూడా మత పర్యాటకాన్ని మరింత విస్తరించేందుకు సౌదీ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది. యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, పర్యాటక రంగాన్ని ఆదాయ వనరుగా అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది.

ప్రతి దేశానికి హజ్ యాత్రికుల కోటా కేటాయిస్తుండగా, అధిక డిమాండ్ కారణంగా అనేక దేశాల్లో వేచిచూడాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. ఈసారి పెరిగిన ఖర్చులు సామాన్య యాత్రికులకు మరింత భారంగా మారే అవకాశం ఉందని ట్రావెల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Spotlight

Read More →