సోషల్ మీడియాలో గంటల తరబడి స్క్రోల్ చేస్తూ గడిపే యువతకు ఇదొక శుభవార్త. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటివాటిలో ఎక్కువ సమయం గడిపే వాళ్ల కోసం ముంబైలోని మాంక్ ఎంటర్టైన్మెంట్ కో-ఫౌండర్ మరియు సీఈఓ విరాజ్ శేత్ ప్రత్యేకంగా ఒక ఉద్యోగ ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ ఉద్యోగానికి “డూమ్-స్క్రోలర్” అనే ప్రత్యేక పేరు పెట్టారు. ప్రతి రోజు కనీసం ఆరు గంటలు సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్లో స్క్రోల్ చేసే నైపుణ్యం ఉండాలి. కేవలం అలవాటు మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో ట్రెండ్స్ను అర్థం చేసుకునే సామర్థ్యం కూడా ఉండాలని విరాజ్ శేత్ పేర్కొన్నారు.
అర్హతలలో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నైపుణ్యం, సోషల్ మీడియా పై ఆసక్తి, క్రియేటర్ కల్చర్ పట్ల అంకితభావం, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వాడగలగడం ఉండాలి. ఉద్యోగం ఫుల్ టైమ్ విధానంలో ముంబైలో ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టుపై నెటిజన్లు తమదైన సరదా కామెంట్లతో స్పందిస్తున్నారు.
కొందరు “ఇన్స్టాలో సమయం వృథా చేస్తున్నాననుకున్నా, ఇప్పుడు అదే స్కిల్!” అని చెప్పారు, మరికొందరు “నేను 19 గంటలు స్క్రోల్ చేస్తా, ఈ ఉద్యోగానికి పర్ఫెక్ట్ కాదా?” అని రియాక్షన్ ఇచ్చారు. కొందరు సరదాగా “ఇది మా అమ్మకు చూపించాలి, స్క్రోలింగ్ కూడా ప్రొఫెషన్ అవుతుంది!” అని కామెంట్ చేస్తున్నారు.