Australia: వీసా మోసం కేసులో కిలక మలుపు.. రూ.5 కోట్లకు పైగా ఆస్తులు స్వాధీనం!

Australia: ఆస్ట్రేలియాలో వీసా మోసం కేసుకు సంబంధించి అధికారులు భారీ చర్యలు చేపట్టారు.

Published : 2026-06-06 16:33:00

తప్పుడు వీసా దరఖాస్తుల వ్యవహారం.. ఆస్ట్రేలియాలో వ్యక్తికి జైలు శిక్ష..

వలస చట్టాలను మోసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు..

ఆస్ట్రేలియాలో వీసా మోసం కేసుకు సంబంధించి అధికారులు భారీ చర్యలు చేపట్టారు. న్యూ సౌత్ వేల్స్ సెంట్రల్ కోస్ట్‌కు చెందిన 61 ఏళ్ల వ్యక్తి నిర్వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసా మోసంపై విచారణ జరిపిన అనంతరం, 5.8 లక్షల డాలర్లకు పైగా నిధులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తు వివరాల ప్రకారం, ఆస్ట్రేలియా వలస వ్యవస్థలోని కొన్ని పథకాలను దుర్వినియోగం చేస్తూ, ముఖ్యంగా రీజినల్ స్పాన్సర్డ్ మైగ్రేషన్ స్కీమ్‌కు సంబంధించిన దరఖాస్తుల్లో తప్పుడు సమాచారాన్ని సమర్పించేందుకు ఈ వ్యక్తి సహకరించినట్లు గుర్తించారు. విదేశీయులు ఆస్ట్రేలియాలో కొనసాగేందుకు దాఖలు చేసిన వీసా దరఖాస్తుల్లో తప్పుడు పత్రాలు సమర్పించడంలో సహాయం చేసినందుకు అతను పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఆర్థిక లావాదేవీలపై జరిగిన విచారణలో, అతనికి సంబంధించిన బ్యాంకు ఖాతాల ద్వారా లక్షల డాలర్లు బదిలీ అయినట్లు బయటపడింది. ఆ డబ్బులో కొంత భాగాన్ని ఇతర ఆస్తుల కొనుగోలుకు వినియోగించినట్లు గుర్తించిన అధికారులు, క్రిమినల్ అసెట్స్ కాన్ఫిస్కేషన్ టాస్క్‌ఫోర్స్ (CACT) ద్వారా ఆ నిధులను నిలిపివేసి స్వాధీనం చేసుకునే చర్యలు ప్రారంభించారు.

ఇటీవల న్యూ సౌత్ వేల్స్ సుప్రీంకోర్టు 117,000 డాలర్లను ప్రభుత్వానికి జప్తు చేయాలని ఆదేశించింది. 2017 జూలై నుంచి 2020 మే మధ్య జరిగిన నేరాలకు సంబంధించి ఆ మొత్తం అక్రమంగా సంపాదించినదేనని నిందితుడు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.

తాజా కోర్టు ఆదేశాలతో కలిపి ఇప్పటివరకు మొత్తం 583,146.44 డాలర్లు ఆస్ట్రేలియా ప్రభుత్వానికి జప్తు చేయబడ్డాయి. ఈ కేసులో నిందితుడికి 2025 డిసెంబరులో నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు. అందులో కనీసం రెండున్నరేళ్లు తప్పనిసరిగా జైలులో గడపాల్సి ఉంటుంది.

స్వాధీనం చేసుకున్న నిధులను నేరాల నివారణ కార్యక్రమాలు, చట్ట అమలు సంస్థల సామర్థ్యాల పెంపు, అలాగే సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

అధికారుల సమాచారం ప్రకారం, 2019 జూలై నుంచి ఇప్పటి వరకు క్రిమినల్ అసెట్స్ కాన్ఫిస్కేషన్ టాస్క్‌ఫోర్స్ సుమారు 1.3 బిలియన్ డాలర్ల విలువైన నేరాలకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. వీటిలో స్థిరాస్తులు, లగ్జరీ వాహనాలు, ఖరీదైన కళాఖండాలు, యాచ్‌లు కూడా ఉన్నాయి.

నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ద్వారా నేరస్థులు అక్రమ లాభాలు పొందకుండా నిరోధించడమే తమ లక్ష్యమని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు స్పష్టం చేశారు.

Spotlight

Read More →