Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు!

Amaravati: ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల తాజా స్థితిగతులు. షీర్ వాల్, డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్న అసెంబ్లీ, సచివాలయం అధికారుల నివాస సముదాయాలు

Published : 2026-04-12 10:47:00

Amaravati:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధమైన ఆమోదం లభించడంతో ఇప్పుడు అక్కడ నిర్మాణ పనులు శరవేగంగా పుంజుకున్నాయి. శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం, త్వరలో వెలువడనున్న రాష్ట్రపతి గెజెట్ నోటిఫికేషన్‌తో రాజధాని ప్రాంతం సరికొత్త రూపురేఖలను సంతరించుకుంటోంది. ఒకప్పుడు నిలిచిపోయిన క్రేన్లు ఇప్పుడు మళ్లీ తిరుగుతున్నాయి, వేల సంఖ్యలో కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఆధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న ఈ నగరం, రాబోయే తరాలకు ఒక అద్భుత కట్టడంగా నిలవబోతోంది.

రాజధానిలో ప్రధానంగా రవాణా సౌకర్యాల కోసం రోడ్ల నెట్‌వర్క్‌ను అత్యంత పకడ్బందీగా నిర్మిస్తున్నారు. మొత్తం 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అమరావతిని అనుసంధానిస్తూ ఈస్ట్-వెస్ట్ (E), నార్త్-సౌత్ (N) పేరుతో గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యమైన 'సీడ్ యాక్సెస్ రోడ్' పనులు దాదాపు పూర్తికావొస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి మణిపాల్ హాస్పిటల్ వరకు సాగే ఈ రహదారిలో రెండు భారీ స్టీల్ బ్రిడ్జ్‌లను నిర్మిస్తున్నారు. కొండవీటి వాగుపై నిర్మించే ఈ ఎలివేటెడ్ కారిడార్ రాజధానిలోకి ప్రవేశించే వారికి ఒక మధురానుభూతిని ఇస్తుంది.

అమరావతి అంటేనే ఆకాశహర్మ్యాలు. ఇక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు  ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న నివాస సముదాయాలు తుది దశకు చేరుకున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం కేటాయించిన 12 టవర్ల పనులు పూర్తయి, ప్రస్తుతం సుందరీకరణ  పనులు జరుగుతున్నాయి. వీటిలో 'షీర్ వాల్' అనే అత్యాధునిక టెక్నాలజీని వాడటం వల్ల, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలనైనా ఇవి తట్టుకోగలవు. ఐఏఎస్ అధికారుల విల్లాలు, గెజిటెడ్ అధికారుల ఫ్లాట్లు ఇప్పటికే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే ఈ గృహ సముదాయాలు ప్రజలతో కిటకిటలాడనున్నాయి.

పాలన పరంగా గుండెకాయ వంటి 'గవర్నమెంట్ కాంప్లెక్స్' నిర్మాణాలు అబ్బురపరుస్తున్నాయి. 250 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్న ఐకానిక్ అసెంబ్లీ భవనంపై ఒక పర్యాటక లిఫ్ట్ సౌకర్యం కూడా ఉండబోతోంది. ఇక సచివాలయ టవర్ల విషయానికొస్తే, దేశంలోనే తొలిసారిగా 'డయాగ్రిడ్' టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల లోపల పిల్లర్లు లేకుండానే విశాలమైన హాల్స్ నిర్మించే వీలుంటుంది. హైకోర్టు భవనం కూడా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌తో నిర్మితమవుతోంది. ఈ ఐకానిక్ కట్టడాలన్నీ మరో రెండేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా సీఆర్డీయే అధికారులు పనిచేస్తున్నారు.

కేవలం అధికారులకే కాకుండా సామాన్య ప్రజల కోసం కూడా అమరావతిలో భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. 'హ్యాపీ నెస్' పేరుతో నిర్మిస్తున్న గేటెడ్ కమ్యూనిటీలో 1200 ఫ్లాట్లు రూపుదిద్దుకుంటున్నాయి. స్విమ్మింగ్ పూల్స్, జిమ్ వంటి ఆధునిక వసతులతో ఇది మధ్యతరగతి ప్రజలకు రాజధానిలో నివాసాన్ని అందిస్తుంది. అలాగే 33 అంతస్తులతో నిర్మించే ఏపీఎన్ఆర్టీ టవర్ రాజధానిలో మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. నీటి ఎద్దడి లేకుండా రిజర్వాయర్లు, వరద ముప్పు లేకుండా ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌తో అమరావతి ఒక 'జీవన యోగ్యమైన నగరం'గా మారుతోంది.

Spotlight

Read More →